ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ: వేదనతో ప్రేమజంట ఆత్మహత్య
వరంగల్: తమ ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో చోటు చేసుకుంది.
'ఒకేచోట పాతి పెట్టండి': ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమికుల మతాలు వేరుకావడంతో ఇరు కుటుంబాల వారు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.
పరిచయం ప్రేమగా..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే దుగ్గొండి మండలం రేకం పల్లికి చెందిన భరత్ (25), ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన నజీమా(23)లు నర్సంపేటలోని ఓప్రైవేట్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు ప్రేమలో పడ్డారు.
ప్రేమ పెళ్లి చేయమంటే..
ఇరువురు తమ ప్రేమ గురించి తమ కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి చేయమని అడిగారు. అయితే భరత్కు నజీమాను ఇవ్వడం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధం చూశారు.
ఆత్మహత్యాయత్నం
ఈ నేపథ్యంలో ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేమని భావించిన ఆ ప్రేమ జంట..ఆన్లైన్లో పురుగుల మందును ఆర్డర్ చేసింది. జనవరి 15న ఇనిస్టిట్యూట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.
చికిత్స పొందుతూ..
ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రేమజంట.. గురువారం రాత్రి కన్నుమూసింది. వీరిద్దరి మరణంతో వారి ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.