ఎంఐఎం ఎంపిటిసి సభ్యుడి దారుణ హత్య
రంగారెడ్డి: జిల్లాలోని సరూర్నగర్ మండలం జల్పల్లి ఎంఐఎం ఎంపిటిసి సభ్యుడు ఎస్కె సలీం దారుణ హత్యకు గురయ్యారు. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పహాడీషరీఫ్ పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్ మండలం జల్పల్లి పంచాయతీ పరిధిలోని వాది ఎ హుదా నాలుగో వార్డు ఎంఐఎం పార్టీ ఎంపిటిసిగా సలీం నిరుడు జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది.
కాగా, భూతగాదాల్లో ఆయనకు, కొందరు రియల్టర్లకు మధ్య విభేదాలున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు కుటుంబ తగాదాలూ ఉన్నాయని చెప్పారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వచ్చిన నలుగురు దుండగులు గొడవకు దిగారు.
ఆ సమయంలో సలీం కుటుంబసభ్యులు నిద్రిస్తున్నారు. జన సంచారం కూడా లేకపోవడంతో అదనుగా భావించిన దుండగులు సలీంను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి అక్కడ్నుంచి పరారయ్యారు. సలీం అరుపులు విని నిద్రలేచిన కుటుంబసభ్యులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే సలీం మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సలీం మృతితో ఆయన కుటుంబంతోపాటు జల్పల్లిలో విషాధం నెలకొంది.