హుస్సేన్ సాగర్లో పల్టీ కొట్టిన కొత్త కారు: ముగ్గురికి గాయాలు..
హైదరాబాద్: హైదరాబాద్లో ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. అదుపు తప్పి హుస్సేన్ సాగర్లో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల కిందటే కారును కొన్నట్లుగా తేలింది. మితి మీరిన వేగం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా నిర్ధారించారు.
గాయపడ్డ వారు ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ గుర్తించారు. నాలుగు రోజుల కిందటే కొత్తగా కారును కొనడంతో సరదాగా డ్రైవింగ్ చేయడానికి దాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ పార్క్ మీదుగా అఫ్జల్ గంజ్కు బయలుదేరారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ పార్క్ వైపు వేగంగా వెళ్తోన్న సమయంలో కారు అదుపు తప్పింది. నేరుగా హుస్సేన్ సాగర్లోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో నితిన్ కారును డ్రైవ్ చేస్తోన్నట్లు సమాచారం.
ఫుట్పాత్ను ఢీ కొట్టింది. అదే వేగంతో రెయిలింగ్ను ఢీ కొని దూసుకెళ్లింది. హుస్సేన్ సాగర్ పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. స్వల్పంగా గాయపడ్డారు. తెల్లవారు జామున జాగింగ్ కోసం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని యశోదా ఆసుపత్రికి తరలించారు.
హుస్సేన్ సాగర్లో పల్టీ కొట్టిన కొత్త కారు: ముగ్గురికి గాయాలు..#Telangana, #Hyderabad pic.twitter.com/gQT1F97DD4
— oneindiatelugu (@oneindiatelugu) November 28, 2021
తెల్లవారు జాము కావడం, ఆ సమయంలో ఫుట్పాత్పై ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఫుట్పాత్ మీద ఎవరైనా ఉండివుంటే కారు సృష్టించిన బీభత్సానికి ప్రాణనష్టం సంభవించి ఉండేదనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కారులో ఉన్న వారికి కూడా ప్రాణాపాయం తప్పడంత ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్ స్పీడింగ్ వంటి పలు సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడ్డ వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.