జ్వరం వచ్చిన విద్యార్థినిపై లెక్చరర్ అమానుషం; రెండు కాళ్ళు కోల్పోయిన విద్యార్థిని!!
రాజన్న సిరిసిల్ల జిల్లా: తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. అంతటి మహోన్నత స్థానం ఇచ్చిన గురువు తన గురుతరమైన బాధ్యతను నిర్వర్తించకుండా, అకారణంగా ఓ విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనేక సందర్భాలలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువులు, తమ కఠినమైన నిర్ణయాలతో వారి జీవితాలను ప్రశ్నార్ధకం చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.

జ్వరం వచ్చి లీవ్ తీసుకున్న విద్యార్థినిపై లెక్చరర్ అమానుషం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంటకు చెందిన నిహారిక వేములవాడ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విద్యార్థిని జ్వరం కారణంగా రెండు రోజులు సెలవు తీసుకుంది. ఆ తర్వాత కళాశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఐదు రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ విద్యార్థినిని నిలబెట్టి కామర్స్ లెక్చరర్ శిక్షించారు.

పనిష్మెంట్ ఇచ్చిన లెక్చరర్ .. విద్యార్థిని కాళ్ళు చచ్చుబడిపోయాయన్న వైద్యులు
అసలే జ్వరం, ఆపై ప్రతి రోజూ అన్ని గంటలపాటు నిల్చోవడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ ఆగి, విద్యార్థిని అక్కడికక్కడే పడిపోయింది. దీంతో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. వైద్యులు విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయని తెలిపారు. జ్వరం తీవ్రంగా ఉండటంతో పడిపోయిన తరువాత ఇంటికి తీసుకు వెళ్లారని, మళ్లీ ఇంటి దగ్గర పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లారని, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయని చెప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థినిని నిత్యం తొమ్మిది గంటలు నిలబెట్టిన లెక్చరర్
లెక్చరర్ ప్రతి రోజూ అన్ని గంటలపాటు నిహారిక నిలబెట్టడం వల్లే ఆమె ఆరోగ్యం మరింత చెడిపోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోజూ 9 గంటలు నిహారిక నిలబడేదని చెప్తున్నారు. ఇక ఈ ఘటన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. సంబంధిత లెక్చరర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, లెక్చరర్ తో పాటు, కళాశాల ప్రిన్సిపాల్ పై కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్స్ చేశారు.

కలెక్టర్ సీరియస్ ... లెక్చరర్ ని సస్పెండ్ చెయ్యాలని ఆదేశం
లెక్చరర్ ని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏది ఏమైనా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకుడు విద్యార్థినిపై అమానవీయంగా ప్రవర్తించటం, ఆపై విద్యార్థిని రెండు కాళ్లు చచ్చుబడిపోయి లేవలేని స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. విద్యార్థులకు క్రమశిక్షణ, చదువు పట్ల శ్రద్ధ ఉండాలి కానీ వాటి కోసం కఠినమైన శిక్షలు వెయ్యటం మంచిది కాదు. పర్యవసానం ఇలా ఉంటే విద్యార్ధి భవిష్యత్ నాశనం అవుతుంది.












Click it and Unblock the Notifications