ఇల్లు మారలేదని.. కూతురుకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్లో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఇల్లు మారదామంటే భర్త అంగీకరించడం లేదనే మనస్తాపంతో 4 నెలల పసిపాపతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్లో నివాసం ఉంటున్న సాయికుమార్ భార్య శ్వేత(26) పుట్టింటి నుంచి సోమవారమే భర్త వద్దకు వచ్చింది. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉంటే ఒంటరిగా అనిపిస్తుందని, వేరే ఇల్లు మారదామని భర్తను కోరింది.
అయితే అందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై తన కూతురు ఐశ్వర్య(4 నెలలు)పైనా, తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. దీంతో సంఘటనా స్థలంలోనే తల్లీబిడ్డా మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఉన్న యువకుడి పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడ్ని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మహిళ మృతి
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మహిళ మృతి చెందింది. జూబ్లీహిల్స్కు చెందిన మహిళ కొద్ది రోజుల క్రితం స్వైన్ ఫ్లూతో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మరో 9 మంది వ్యక్తులు చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications