దారుణం: ఇంటికి తీసుకెళ్తామని.. మహిళకు మద్యం తాగించి గ్యాంగ్రేప్ చేశారు
నల్గొండ: ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలోని మోతె మండలం రాపుంరతండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాంపురంతండాకు చెందిన వివాహిత ఫిబ్రవరి 5న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు సంతకు వెళ్లింది.
సంతలో గొర్రెలు కొనుగోలు చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ మామిళ్లగూడెంలో ఆటో కోసం నిల్చుంది. అదే తండాకు చెందిన భూక్యా నాగు బైక్పై వెళ్తూ ఇంటికి తీసుకెళ్తానంటూ ఆమెను తన బైక్పై కూర్చొబెట్టుకున్నాడు.
మామిళ్లగూడెం, విభళాపురం గ్రామాల మధ్య చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న ఆంగోతు చందర్, బాణోతు శ్రీను, నాగులతో కలిసి మద్యం తాగాడు. మహిళకు కూడా మద్యం తాగించి ఆమెపై ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పరారయ్యారు.
ఇంటికి చేరుకున్న బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై సూర్యాపేట సీఐ నర్సింహారెడ్డి విచారణ జరిపి ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
యువకుని ఆత్మహత్య
నాగార్జున సాగర్ జలాశయంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హిల్కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిల్కాలనీకి చెందిన పందరి సాయికిరణ్(22) ఆనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.
దీంతో మనస్థాపం చెంది సాగర్ జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడు అవివాహితుడు.