పెళ్లి సంబంధాలు కుదరక మహిళా టెక్కీ ఆత్మహత్య: విద్యార్థినిపై గ్యాంగ్రేప్
హైదరాబాద్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడం, తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ పోలీస్లైన్స్లో నివసించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూతురు అన్నపురెడ్డి శ్రీలక్ష్మి(23) బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో చేరింది. కాగా, ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. అతడు పెళ్లికి నిరాకరించడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది.
మరోవైపు తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదురడంలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి బాత్రూంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మాయమాటలు చెప్పి తోటి విద్యార్థినిపై రేప్
సొంతూరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దామరచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(16) స్థానికంగా ఓ కళాశాలలో నర్సింగ్ చదివి, వ్యక్తిగత కారణాలతో మధ్యలో చదువు ఆపేసింది.
ఫిబ్రవరి 12న మఠంపల్లి మండలంలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగివస్తూ పొద్దుపోయాక మిర్యాలగూడెం శివారు ఈదులగూడెం వద్ద దిగింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న ఆ యువతి వద్దకు సహచర ముగ్గురు విద్యార్థులు వచ్చారు. ఇంటి వద్ద దింపుతామని చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేగాక, 2రోజుల తర్వాత ఆ విషయాన్ని మరికొందరికి చెప్పి మిగతావారినీ ప్రోత్సహించారు. వారు అమ్మాయికి ఫోన్ చేసి వేధించసాగారు. దీంతో ఫిబ్రవరి 16న బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
జడ్జి ఎదుట బాధితురాలిని హాజరు పరిచి ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. బాధితురాలు 16న పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నిందితులు ఎవరన్నది తెలిసినా ఇప్పటి వరకు వారిని అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.