ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పు.!పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతమన్న భట్టి.!
హైదరాబాద్ : పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఓటర్ కార్డు తో ఆధార్ ను అనుసంధానం చేయడానికి లోక్ సభలో ఎన్నికల చట్టాల సవరణ 2021 బిల్లును ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అప్రజాస్వామికమని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేసారు. లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లు ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదించడం విడ్డూరంగా ఉందన్నారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉందని మండిపడ్డారు. ఆధార్ కార్డు అనేది- చిరునామా కోసం మాత్రమే వినియోగించేదని, దేశంలో తమకు పౌరసత్వం ఉన్నట్లుగా నిర్దారించాడానికి జారీ చేసిన గుర్తింపు కార్డు కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.

ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం వల్ల సంబంధిత ఓటర్కు ఉన్న పూర్తి వివరాలు బహిర్గతమౌతాయని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ బిల్లును తీసుకు రావడం వెనుక ఉద్దేశ్యం ఏంటని భట్టి ప్రశ్నించారు. ఈ బిల్లులో న్యాయపరమైన అనేక లోపాలు ఉన్నాయని, దీన్ని పరిశీలన కోసం స్థాయీ సంఘానికి పంపించాల్సి ఉందని కాంగ్రెస్ సభా పక్ష నేత, ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వినిపించుకోని నియంతృత్వ మోడీ సర్కార్ పౌరుల వ్యక్తిగత, సమాచార భద్రత హక్కును ఈ బిల్లు ఆమోదంతో లాక్కున్నదని దుయ్యబట్టారు. ఓటర్ ఐడీ కార్డుతో అనుసంధానం చేయించుకోలేని వారికి ప్రభుత్వం నుంచి అందుతోన్న ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమ పథకాలను కూడా రద్దు చేయడానికి ఈ చట్ట సవరణ కారణం అయ్యే అవకాశం ఉందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications