భార్యతో గొడవపడి, మద్యం మత్తులో..: ప్రజాభవన్కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: మంగళవారం ప్రజా భవన్, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ చేసిన వ్యక్తిని బుధవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లికి చెందిన శివకుమార్ అలియాస్ అశోక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డయల్ 100కి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ నిందితుడిని నాంపల్లి పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు. మంగళవారం ఉదయం పంజాగుట్ట ప్రజా భవన్లో, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని కాసేపట్లో పేలుతుందని ఫోన్ చేసి నిందితుడు శివకుమార్
ఆందోళనకర వాతావరణం సృష్టించిన తెలిసిందే.

అయితే, నిందితుడు భార్యతో గొడవ పడి మద్యానికి బానిసగా మారి, భార్య తన వద్ద లేదన్న బాధ, డిప్రెషన్లో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు నిందితుడు 100కు డయల్ చేసి చెప్పాడు. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది.
ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ ఎంట్రాన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, వాహనాలను, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టి శివకుమార్ అలియాస్ అశోక్ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications