నాయకుడిని అయ్యేందుకు రాలేదు, అలా చేస్తా: కొండారెడ్డిపల్లిలో ప్రకాశ్రాజ్
మహబూబ్ నగర్: తాను నాయకుడిని అయ్యేందుకు ఇక్కడకు రాలేదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మంగళవారం అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లిలో ఆయన పర్యటిస్తున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఈ రోజు గ్రామంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. సోమవారం తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ను కలిసిన ప్రకాశ్రాజ్ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అనంతరం ఈ రోజు గ్రామంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో నుంచి పదిమందిని ఎన్నుకోండని, వారితో కలిసి తాను అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న గ్రామస్థుల తపన చూసే ఇక్కడకు వచ్చానని చెప్పారు.
తాను నాయకుడిని అయ్యేందుకు ఇక్కడకు రాలేదని చెప్పారు. భూమి మనది, రాష్ట్రం మనది, హక్కులు ఉన్నాయని కాబట్టి ఎవరూ అడుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కొన్నేళ్ల తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామమే మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకునేలా తయారు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లెలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పర్యటిస్తున్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు సోమవారం ప్రకటించిన ఆయన తదుపరి రోజే అక్కడికి వెళ్లడం గమనార్హం.
సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమై సామాజిక బాధ్యతలో భాగంగా ప్రకాశ్ రాజ్ కొండారెడ్డి పల్లెని దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.
ప్రకాశ్రాజ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే కర్ణాటకలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్కు వివరించారు. అదే విధంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని తెలిపారు. కొండారెడ్డిపల్లెలో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నానని చెప్పారు.