ఎర్రబెల్లి ఉదంతం: చంద్రబాబుపై హెచ్చార్సీకి న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభను భగ్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్రపన్నారని తెలంగాణ న్యాయవాదుల జెఎసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
చంద్రబాబుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. దానిపై స్పందించిన హెచ్ఆర్సీ నవంబర్ 3వ తేదీలోగా విచారణ నివేదిక కమిషన్కు అందజేయాలని వరంగల్ రేంజ్ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 27న వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన సభకు అంతరాయం కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెచ్చ గొట్టారని న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు కొంతం గోవర్ధన్రెడ్డి, వడ్యారపు రవికుమార్, తిరుపతివర్మ ఆరోపించారు.
పథకం ప్రకారం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ కార్యర్తలతో సభలో రాళ్లు వేయించారని, ఘటనలో ఒక ఎస్ఐ , పలువురు ప్రభుత్వ అధికారులు, సభకు హాజరైన ప్రజలను గాయాల పాలు చేయడం ద్వారా భయాందోళనలు సృష్టించారన్నారు.
తెలంగాణ మంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలను ఉసిగొలిపి శాంతిభద్రలకు విఘాతం కలిగించిన చంద్రబాబునాయుడుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు హెచ్ఆర్సీని కోరారు.