లింబయ్య ఆత్మహత్యను వక్రీకరించారు: యాష్కీ, మాట మార్చిన కేసీఆర్: చాడ
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు ఆత్మహత్యను టీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్యానేర చట్టం కింద ప్రభుత్వ పెద్దలపై కేసులు పెట్టాలన్నారు.
నిజామాబాద్ ఎంపీ కవిత ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని, వందల కోట్ల అవినీతి జరుగుతున్నా దానిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ జాగృతి సంస్ధ ద్వారా రైతులను ఆదుకుంటామన్న కవితకు నిధులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలని కాంగ్రెస్ నేత అనిల్ డిమాండ్ చేశారు.
రైతుల ఆత్మహత్యలపై ఎంపీ కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే ఎవరూ నమ్మడం లేదన్నారు. రైతులను ఆదుకునేలా సీఎం కేసీఆర్ను కవిత ఒప్పించాలని లేదంటే రాజీనామా చేయాలన్నారు.
ఎందుకు పరామర్శించడం లేదు: ఉత్తమ్
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాష్ట్ర మంత్రులు ఎందుకు పరామర్శించడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం గాంధీభవన్లో 'అన్నదాత ఆర్తనాదం' పుస్తకాన్ని టిపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆవిష్కరించారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం లేదని స్పష్టంచేశారు. రైతు సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చారు?: సీపీఐ నేత చాడ
విమోచన దినంగా సెప్టెంబర్ 17వ తేదీని నిర్వహించాలని గతంలో ఉద్యమించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. విమోచన దినపై కేసీఆర్ కనీసం మాట కూడా మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు.
సోమవారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ సాయధ పోరాట వారోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినానికి, మతాలకు సంబంధం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే, తామే సెప్టెంబర్ 17వ తేదీన తమ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేస్తామన్నారు.