సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన దిశగా - పార్టీ నేతలకు ఆహ్వానం..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన దిశగా ముహూర్తం ఫిక్స్ అయింది. కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ..కొత్త పార్టీ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక, దీని పైన అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పార్టీ పేరుతో పాటుగా జెండా -అజెండా ను ఖరారు చేయనున్నారు. ఇందుకోసం దసరాను ముహూర్తంగా ఫైనల్ చేసారు. అక్టోబర్ 5న దసరా నాడు పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎంపీలు - ఎమ్మెల్సీలు- ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని పార్టీ సూచించింది.
దసరా నాడు కీలక ప్రకటన
ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానాలు చేసారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ అమలు చేస్తున్న విధానాల పైన అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ నిలదీస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు.
తమిళనాడు - బీహార్ - ఢిల్లీ- జార్ఖండ్- పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించారు. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సుదీర్ఘ సమావేశం జరిపారు. బీహార్ వెళ్లిన సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకమవుతామని కేసీఆర్ - నితీశ్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన - కార్యాచరణ ప్రకటించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ పేరు - కార్యాచరణ ఖరారు
టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ దసరా నాడు పార్టీ కార్యవర్గం - ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. అదే సమయంలో తన జాతీయ పార్టీ విధి విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు వెల్లడించనున్నారు. తెలంగాణ ఎన్నికల వరకు కేసీఆర్ సీఎంగా కొనసాగే అంశం పైన ఇప్పటికే స్పష్టత ఇఛ్చారు.
ఎన్నికల ఫలితాల తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పదవుల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, తెలంగాణలో తిరిగి అధికారం దక్కించుకోవటం ద్వారానే జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు ఉంటుందని కేసీఆర్ మద్దతు దారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హాట్రిక్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే
అటు బీజేపీ కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలనే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఆదరణ లేదని టీఆర్ఎస్ ముఖ్య నేతల విశ్లేషణగా ఉంది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో కలిసే తమ ప్రత్యామ్నాయ కూటమి ఉంటుందని ఇటీవలే బీహార్ సీఎం నితీశ్ స్పష్టం చేసారు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ ఈ విషయం పైన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్న వేళ..దీని పైన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో.దసరా నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు..సమావేశాల్లో ఎటువంటి తీర్మానాలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.