పరిషత్ పోరుకు సర్వం సిద్ధం.. తొలిదశ ఎన్నికకు పూర్తైన ఏర్పాట్లు..
తెలంగాణలో తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వాటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యారు. దీంతో వాటికి మినహా మిగిలిన స్థానాల్లో పోలింగ్ నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు మినహా మిగతా చోట్ల ఉ. 7గం.ల నుంచి సా. 5గం. వరకు పోలింగ్ జరగనుంది.
నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు
ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్లు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ సిబ్బంది నిర్వాహణ తదితర అంశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్ బూత్లకు సమీపంలో 144 సెక్షన్ విధించడంతో పాటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు.
ఎంపీటీసీ బరిలో 7,702 మంది
మండల పరిషత్ ఎన్నికల్లో ఒక్కో స్థానానికి సగటున ముగ్గురేసి చొప్పున పోటీ పడుతున్నారు. పరిషత్ తొలివిడత ఎన్నికల్లో 195 మండలాల్లో 2,157 ఎంపీటీసీ స్థానాలకుగానూ 7,702 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిలో టీఆర్ఎస్ నుంచి 2,094, కాంగ్రెస్ నుంచి 1,867, బీజేపీ నుంచి 1,057, సీఎం తరఫున 138, టీడీపీ నుంచి 107, సీపీఐ నుంచి 82, ఇతర పార్టీల నుంచి 61, ఇండిపెండెంట్లుగా 1,666 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.
జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది పోటీ
రాష్ట్రవ్యాప్తంగా సగటున ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి నలుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. మొత్తం 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అన్ని సీట్ల నుంచి పోటీకి దిగుతుండగా.. కాంగ్రెస్ 190, బీజేపీ 171, టీడీపీ 63, సీపీఎం 22, సీపీఐ 14 మందిని బరిలో నిలిపింది. 193 మంది స్వతంత్ర అభ్య్రర్థులుగా పోటీ చేస్తున్నారు.
5 జిల్లాలో సా.4గం. వరకే పోలింగ్
మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ సమయం గంట తగ్గించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, జయశంకర్, ములుగు జిల్లాల్లో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ఉ. 7గం.ల నుంచి సా. 4 గం.ల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జల్లాలో 46, బెల్లంపల్లి జిల్లాలో 47, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71, జయశంకర్ భూపాలపల్లిలో 38, ములుగులో 36 ఎంపీటీసీ స్థానాల్లో నాలిగింటికే పోలింగ్ పూర్తికానుంది.