Allu Arjun మామకు బిగ్ షాక్.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు!
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ నానక్రామ్గూడలో తీవ్ర భూవివాదం కలకలం రేపింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నానక్రామ్గూడలోని ప్రముఖ 'మంత్రీ కాస్మోస్' భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, సెక్యూరిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి ఆక్రమణలకు పాల్పడ్డారని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాళాలు పగులగొట్టి దౌర్జన్యం.. సీసీటీవీల్లో దృశ్యాలు రికార్డ్!
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలో వచ్చిన కొందరు వ్యక్తులు బిల్డింగ్ సౌత్వెస్ట్ కార్నర్ గేట్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అక్కడున్న కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, అక్రమంగా టిన్షీట్లు ఏర్పాటు చేశారు. వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి, ఎదురుతిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దౌర్జన్య కాండ అంతా ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయిందని బాధితులు తెలిపారు.

ఐటీ సంస్థల కార్యకలాపాలకు ముప్పు.. అత్యవసర మార్గం బంద్!
సర్వే నంబర్ 130 లో ఉన్న మంత్రీ కాస్మోస్ బిల్డింగ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (SEZ) పరిధిలోకి వస్తుందని, ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది. బిల్డింగ్ సౌత్ భాగంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లు, వ్యర్థాల నిర్వహణ షెడ్లు ఉన్నాయి. అంతేకాక, ఈ సౌత్వెస్ట్ మార్గం అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్ల రాకపోకలకు అత్యంత కీలకమైనది. ఈ మార్గాన్ని ఆక్రమించడం వల్ల ఐటీ సంస్థల నిర్వహణకు, అత్యవసర సేవలకు పెద్ద ఆటంకం ఏర్పడుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి!
ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్, ఆధారాల ఫొటోలను పెన్డ్రైవ్లో పెట్టి గచ్చిబౌలి పోలీసులకు అందజేశారు. దౌర్జన్యానికి పాల్పడిన చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి సహా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ కోరింది. ఐటీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ గచ్చిబౌలి పీఎస్తో పాటు తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను పంపినట్లు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
