హైదరాబాద్ వెళ్లా, సిమి మాజీ చీఫ్ సలావుద్దీన్ ఫ్యామిలీ తెలుసు: ఆంద్రాబీ
శ్రీనగర్: తాను హైదరాబాద్ వెళ్లిన మాట వాస్తవమేనని కాశ్మీరీ వేర్పాటువాద నాయకురాలు, దుఖ్తరాన్ - ఎ- మిలత్ చీఫ్ ఆసియా ఆంద్రాబీ అంగీకరించారు. హైదరాబాదుకు చెందిన సిమీ మాజీ చీఫ్ సయ్యద్ సల్లావుద్దీన్ కుటుంబం తనకు తెలుసునని ఆమె చెప్పారు. సల్లావుద్దీన్కు నివాళులు అర్పించడానికి తాను హైదరాబాద్ వెళ్లానని ఆమె చెప్పారు. ఈ మేరకు సిఎన్ఎన్ - ఐబిఎన్లో వార్తాకథనం వచ్చింది.
నాగపూర్లో పోలీసులకు పట్టుబడిన ముగ్గురు హైదరాబాద్ యువకులు ఐఎస్ఐఎస్లో చేరేందుకు కాశ్మీర్ వెళ్లి ఆంద్రాబీ సహాయం తీసుకోవాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆమె కొట్టిపారేశారు. అది కట్టుకథ మాత్రమేనని, కాశ్మీర్ కోసం పోరాడుతున్న తనపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉందని, అందుకే ఆ కట్టుకథను అల్లిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐఎస్ఐఎస్తో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తాను కాశ్మీర్ కోసం పోరాడుతున్నందు వల్లనే తనను ప్రభుత్వం లక్ష్యం చేసుకుందని ఆమె అన్నారు. సిమి ఉగ్రవాది సలావుద్దీన్ అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు ఆంద్రాబీ ధ్రువీకరించారు. కాగా, ఈ విషయం తమకు తెలియదని, విచారణ జరిపిస్తున్నామని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు. కాగా, తనను కలవడానికి వస్తూ నాగపూర్లో పట్టుబడిన ముగ్గురు హైదరాబాద్ యువకులు తనకు తెలియదని ఆంద్రాబీ చెప్పారు.
కాగా, ఐఎస్ఐఎస్తో ఆంద్రాబీకి సంబంధాలున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. నాగపూర్లో పట్టుబడిన ముగ్గురు హైదరాబాద్ యువకుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ఆరా తీసింది. మొహ్మద్ అబ్దుల్ బాసిత్, సయ్యద్ ఒమర్ ఫరూక్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫరూక్ నాగపూర్లో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి కూడా మాజీ సిమీ చీఫ్ సల్లావుద్దీన్తో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు.
ఇంట్లో చెప్పకుండా ఆ ముగ్గురు కూడా కాశ్మీర్ బయలుదేరారు. దీంతో పోలీసులు వారి అదృశ్యంపై మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు మాజ్ హసన్ ఫరూక్, బాసిత్ 2014లో బంగ్లాదేశ్ మీదుగా అఫ్గనిస్తాన్, సిరియా, ఇరాక్, పాలిస్తీనాలకు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అ సమయంలో వారిని పోలీసులు పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేశారు.