మరో ప్రమాదం: టెక్కీ సహా ముగ్గురిని మింగేసిన ఔటర్ రింగ్ రోడ్డు
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు ప్రమాదాలకు ఆలవాలంగా మారింది. తాజాగా మరో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా దూసుకు వచ్చిన లారీ, ముందు వెళ్తున్న అంబులెన్స్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామానికి చెందిన అయ్యప్ప విశ్వనాథ్ (32) బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశ్వనాథ్ భార్య దీపిక (26) ఆరోగ్యం బాగా లేకపోవడంతో ముంబైలో చికిత్స నిమిత్తం నెలరోజుల క్రితం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స చేయించుకున్న అనంతరం గురువారం తెల్లవారుజామున ముంబై నుంచి స్వస్థలానికి అంబులెన్స్లో వెళ్తున్నారు.

ఔటర్ రింగ్రోడ్డులోని మంచిరేవుల అమృత ఆశ్రమం వద్ద వెనుకనుంచి ఒక లారీ వేగంగా దూసుకువచ్చి ముందువెళ్తున్న అంబులెన్స్ను ఢీకొంది. ఈ సంఘటనలో వెనుక కూర్చుని ఉన్న విశ్వనాథ్, దీపిక, దీపిక తల్లి కంచర్ల భారతి (49) అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్తో పాటు విశ్వనాథ్ తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే గాయపడిన డ్రైవర్తో పాటు విశ్వనాథ్ తండ్రిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications