తెలంగాణపై ఫోకస్! ఆవిర్భావ దినోత్సవ వేళ స్పెషల్ విషెస్..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) వారు ప్రత్యేక సందేశాలను పంచుకుంటూ, రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం, ఉమ్మడి అభివృద్ధిని కాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తయిన ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు నేతలు ప్రత్యేక ప్రకటనలు విడుదల చేశారు.
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలుగా విడిపోయి నేటికి 12 ఏళ్లు పూర్తయినప్పటికీ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు.

"ఎంతో ఘనమైన చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో మన రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేసి, దేశంలోనే కీలక భూమిక పోషించాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటిచెప్పాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు.. అమరులకు వినమ్ర నివాళి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టమని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. "నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం, స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు ఇదని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు, ముఖ్యంగా అమరవీరులకు ఆయన తన వినమ్ర నివాళులు అర్పించారు.
తెలంగాణ గడ్డపై ఉన్న ప్రత్యేకతను చాటుతూ.. "ఈ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం" అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికీ అందాలి
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా-ఆరోగ్య రంగాల్లోని సవాళ్లను తాను రాజకీయ అంశాల కంటే ముందుగా మానవీయ కోణంలోనే చూశానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అని ఆయన నొక్కిచెప్పారు.
ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ఐటీ, ఫార్మా, వ్యవసాయం, స్టార్టప్స్, పారిశ్రామికాభివృద్ధిలో తన ప్రత్యేక ముద్ర వేసుకుందని ప్రశంసించిన ఆయన.. అభివృద్ధి ఫలాలు సమాజంలో చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే దానికి సంపూర్ణ అర్థం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేస్తూ, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2026
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం… pic.twitter.com/820J9VMCSL














Click it and Unblock the Notifications