సిగ్గులేకుండా చంద్రబాబు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు: కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: అధికారం కోసం, నాలుగు సీట్ల కోసం, నోట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దాసోహం అంటున్నారని మంత్రి కేటీ రామారావు ఆదివారం అన్నారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కాకుండా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారట, ఇదేమిటని వ్యాఖ్యానించారు.
ఇంతకన్నా సిగ్గుచేటు ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ అంతా చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకాల ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు తిప్పుతారట అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తెలంగాణలో పులులు అని, కానీ చంద్రబాబు వద్ద మాత్రం పిల్లులు అన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారని, ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారన్నారు.
రాహుల్ గాంధీకి సిఫార్సు చేసి మాకు టిక్కెట్ ఇప్పించమని కాంగ్రెస్ నేతలు చంద్రబాబు ముందు చేతులు కట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నోట్లు ఎవరు ఇచ్చినా, సీట్లు ఎవరు ఇచ్చినా ఓటు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలు అన్నారు.
ప్రజలు మళ్లీ తెరాసకే పట్టం కడతారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం అని, అది మొండి చేయి చూపిందని, బీజేపీ గుర్తు పూవు అని, అది చెవిలో పూవు పెట్టిందని, తెలంగాణ జన సమితి గుర్తు అగ్గిపెట్టే అని అది పుల్లలు పెట్టే వాళ్లకు వస్తుందని చెప్పారు. తెరాస గుర్తు కారు అని, దూసుకెళ్లేందుకే ఇచ్చారన్నారు.