తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం: షర్మిలతో మాజీ డీజీపీ భేటీ, 9న పార్టీలో చేరిక!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్న వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలోకి అప్పుడే చేరికలు మొదలయ్యాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో సంకల్ప సభలో పార్టీ ఏర్పాటు, దాని విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నేతలు షర్మిలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

షర్మిలను కలిసిన మాజీ డీజీపీ స్వరణ్ జీత్ సేన్
తాజాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జీత్ సింగ్ సేన్ షర్మిల పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం షర్మిలను స్వరణ్ జీత్ సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం స్వరణ్ జీత్ సేన్ మాట్లాడుతూ.. తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయన్నారు.

షర్మిలతో కలిసి పనిచేస్తానంటూ స్వరణ్ జీత్ సేన్
వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అవసరమైతే ప్రజలకు సేవ చేసేందుకు షర్మిలతో కలిసి పనిచేస్తానని స్వరణ్ జీత్ సేన్ స్పష్టం చేశారు. కాగా, స్వరణ్ జీత్ సేన్ సతీమణి అనితా సేన్.. ఇప్పటికే వైఎస్ షర్మిలను కలిశారు. ఇప్పుడు స్వరణ్ జీత్ సేన్ కూడా కలవడం గమనార్హం. కాగా, స్వరణ్ జీత్ సేన్ పశ్చిమబెంగాల్కు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఏపీ కేడర్కు ఐపీఎస్గా ఎంపికయ్యారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2004 డిసెంబర్ 31న ఉమ్మడి ఏపీకి డీజీపీ ఎంపికయ్యారు. రెండేళ్లపాటు ఆయన డీజీపీగా సేవలందించారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

9న షర్మిల సభ.. స్వరణ్ జీత్ పార్టీలో చేరే అవకాశం
ఏప్రిల్ 9న సాయంత్రం ఖమ్మంలో సంకల్ప సభను ఏర్పాటు చేశారు షర్మిల. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచే ఆమె టూర్ ప్లాన్ను విడుదల చేశారు. ఆరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి పలుచోట్ల స్వాగత ఉపన్యాసాలు చేసుకుంటూ ఖమ్మం చేరుకోనున్నారు. ఇదే సభలో స్వరణ్ జీత్ సేన్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరికొందరు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications