Nagarjunasagar: నాగార్జునసాగర్ కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తిన అధికారులు..
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో ప్రవాహం పెరిగింది. పై నుంచి భారీ వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద వస్తోంది. అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల 62 వేల 462 క్యూసెక్కులు వరద వస్తుండగా.. అదే స్థాయిలో నీటిని కిందికి వదలుతున్నారు.
శ్రీశైలం నుంచి 2 లక్షల 62 వేల 462 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం కూడా 885 వరకు ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం కుడి, ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కూడా కూడా నిండు కుండలా మారింది. పై నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్టుకు 2లక్షల 10వేల 408 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా.. 2 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా.. ప్రస్తుత నీటిమట్టం గరిష్ఠస్థాయిలోనే ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు తీయడంతో చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ఇటు గోదావరి బేసిన్ వరద సాధారణంగానే ఉంది. శ్రీరాంసాగర్ కు సాధారణంగా ఇన్ ఫ్లో వస్తోంది.
ప్రాజెక్ట్లోకి 20 వేల పైచిలుకు క్యూసెక్కుల వరద వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాకతీయ కెనాల్ ద్వారా 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేపట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం1083.80 అడుగులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 55.97 టీఎంసీలు నీరు ఉంది. ఇటు ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తి పోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నంది మేడారం.. అక్కడ నుంచి లక్ష్మీపూర్ పంపు హౌస్ ఎత్తి పోస్తున్నారు. అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications