బాబ్రీ మసీద్ జిందాబాద్: లోక్సభలో నినాదాలు
Asaduddin Owaisi: లోక్సభలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. జనవరి 22వ తేదీన అయోధ్యలో వైభవంగా జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవంపై చర్చ వాడివేడిగా సాగింది. అధికార భారతీయ జనతా పార్టీతో ఎఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వాగ్వివాదానికి దిగారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోదీ.. ఈ దేశం మొత్తానికీ ప్రధానిమంత్రి అనే భావనను విస్మరిస్తోన్నారని ఒవైసీ విస్మరించారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడికీ ఆయన ప్రధానమంత్రేనని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందని, దీనికి భిన్నంగా దేశంలో పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

హిందువులకు మాత్రమే ప్రతినిధిగా, వారికి మాత్రమే ప్రధానిగా మోదీ వ్యవహరిస్తోన్నారని ఒవైసీ మండిపడ్డారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు, ఇతర మైనారిటీలు నివస్తోన్నారని, వారు ఈ దేశ పౌరులేననే విషయాన్ని గుర్తు చేయాల్సి వస్తోందని చెప్పారు. మతాల వారీగా విభజించేలా పరిపాలిస్తోన్నారని ఆరోపించారు.
మొఘలులకు ప్రతినిధిగా ఒవైసీ మాట్లాడుతున్నాడంటూ బీజేపీ సభ్యులు చేసిన దాడిని ఒవైసీ తిప్పికొట్టారు. బాబర్, ఔరంగజేబ్, మహ్మద్ అలీ జిన్నాలకు తాను ప్రతినిధినా అంటూ ఎదురుదాడికి దిగారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం, మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు అంటే తనకూ గౌరవమేనని తేల్చి చెప్పారు. రామ్ అంటే గౌరవం ఇస్తానని.. నాథూరామ్ గాడ్సేలకు కాదని ఒవైసీ స్పష్టం చేశారు.
హే రామ్ అంటూ రాముడిని తలచుకుంటూ ప్రాణాలొదిలిన మహాత్మాగాంధీని కాల్చి చంపిన ఘనత నాధూరామ్ గాడ్సేకు ఉందని ఒవైసీ ధ్వజమెత్తారు. అలాంటి వారిని బీజేపీ సమర్థిస్తోందంటూ విమర్శించారు. స్వాతంత్రోద్యమంలో ముస్లింలు సైతం బలిదానాలు చేశారని, అండమాన్ కాలాపానీ జైలులో అమరులయ్యారని గుర్తు చేశారు.
అయోధ్యలో బాబ్రీ మసీదు ధ్వంసం కాలేదని, అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. బాబ్రీ మసీదు ఇప్పటికీ అయోధ్యలో ఉంది.. ఎప్పటికీ ఉంటుంది.. అని అన్నారు. బాబ్రీ మసీద్ జిందాబాద్, భారత్ జిందాబాద్.. అంటూ ఒవైసీ తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications