Moharram: ఏపీలో మొహర్రం సెలవు తేదీ మార్పు..! ఉత్తర్వులు జారీ..!
ప్రతీ ఏటా ముస్లింలు మొహర్రం (Moharram) నెల పదో తేదీన ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, ఇతర వర్గాలకు ఇచ్చే సెలవు తేదీలో ఈసారి మార్పు చోటు చేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం (ap govt) గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ లో ఇచ్చిన సెలవులో ఈ మేరకు మార్పు చేశారు. మత పెద్దల సూచన మేరకు మొహర్రం పండుగ సెలవు తేదీలో మార్పు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల జాబితాలో మొహర్రం సెలవును జూన్ 25గా పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని జూన్ 26కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు సీఈవో ఈ మేరకు ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర సంస్థల ఉద్యోగులకు ఈ నెల 26న మొహర్రం సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 9వ మొహర్రం సందర్బంగా ఈ నెల 16న ఇచ్చిన ఆప్షనల్ హాలిడేను కూడా ఈ నెల 25కు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

మొహర్రం సందర్భంగా ముస్లింలు చరిత్రలో తమ వారు చేసిన త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేస్తారు. ప్రస్తుత ఇరాక్ లోని కర్బలా మైదానంలో జరిగిన మహా యుద్దంలో మహమ్మద్ ప్రవక్త మనవళ్లు ప్రాణార్పణ చేసిన రోజు కావడంతో అప్పటి త్యాగాల్ని గుర్తుచేసుకుంటుంటారు. ఈ సందర్భంగా భారత్ తో పాటు వివిధ దేశాల్లో షియా ముస్లింలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు కూడా చేస్తుంటారు. అలాగే ఉద్యోగులకు కూడా ఈ రోజు సెలవు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది.














Click it and Unblock the Notifications