గర్భిణీ హత్య: ఒక్క ఫోటో కోసం రూ.40వేలు, ఎట్టకేలకు చెత్తకుప్పలో..
హైదరాబాద్: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ సమీపంలో సంచలనం రేపిన గర్భిణీ హత్య కేసు చిక్కుముడి వీడినప్పటికీ.. ఓ విషయం మాత్రం పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది.
హత్య మిస్టరీ వీడినప్పటికీ.. మృతురాలి ముఖచిత్రం ఎలా ఉంటుందో మాత్రం వారు గుర్తించలేకపోయారు. ఆమెకు సంబంధించిన ఫోటోలేవి దొరకపోవడంతో పోలీసులు తలపట్టుకున్నారు. కానీ ఎట్టకేలకు ఇటీవలే పోలీసులు ఆమె ఫోటో ఒకటి సంపాదించారు.
గర్భిణీ హత్య: ఏజ్ గ్యాప్ వల్ల వివాహేతర సంబంధం, పింకీ ఫ్యామిలీ పరిస్థితి ఇదీ.. కనీసం ఫోటో లేదు
ఫోటో కోసం దర్యాప్తు:
కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించే విషయంలో మృతురాలి ఛాయాచిత్రం లభించకపోవడం పోలీసులను ఇబ్బందుల్లో పడేసింది. కేసును నిరూపించాలంటే ఫోటో తప్పనిసరి కావడంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు, పింకీ భార్య అయిన వికాస్ ను విచారించగా.. కొన్ని వివరాలు తెలిశాయి.
ఆమె ఫోటోలు ఉన్న మొబైల్ ఫోన్ను ధ్వంసం చేశామని, ఆధార్ కార్డు చించేశామని అతను చెప్పాడు. ఒక ఫోటోను ముక్కలుగా చింపి సిద్దిఖీనగర్ అద్దె ఇంటి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేశామని తెలిపాడు.
ఎట్టకేలకు దొరికిన ఫోటో..:
వికాస్ చెప్పిన ఆధారాలతో సిద్దిఖీనగర్లోని వారి ఇంటి పక్కనున్న చెత్తకుప్పలో పోలీసులు ఫోటో కోసం వెతికారు. దీంతో ఆమె ఫోటోకు సంబంధించిన కొన్ని పేపర్ ముక్కలు అక్కడ లభించాయి. వాటన్నింటిని సేకరించి అతికించగా.. ఆమె ఎట్టకేలకు ఆమె ముఖచిత్రంపై స్పష్టత వచ్చింది. అదే చెత్తకుప్పలో ఆమె ఆధార్ కార్డు కూడా దొరికినట్టు తెలుస్తోంది.
రూ.40వేలు ఖర్చు పెట్టారు..:
పింకీ చిత్రం కోసం పోలీసులు దాదాపు రూ.40వేల వరకు ఖర్చు పెట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా మహారాష్ట్ర, బీహార్, తెలంగాణల్లో గాలించారు. బీహార్ లోని పింకీ తల్లిదండ్రులను సంప్రదించినా ఫోటో లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో.. ఎప్పుడూ ఫోటోలు తీయలేదని వెల్లడించారు.
వివాహేతర సంబంధం.. హత్య:
భర్త వికాస్ మమతఝా అనే మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడమే పింకీ హత్యకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి పింకీ అడ్డుగా ఉందన్న కారణంతో.. నిమిది నెలల గర్భిణి అయిన పింకీని వికాస్ మమతఝా, ఆమె భర్త అనిల్ఝా కలిసి హత్య చేశారు.