శత్రువును దెబ్బ తీసేందుకే చీకట్లో దాడులు.!యుద్ద విమాన పైలట్ గా అనుభవాలను తెలిపిన ఉత్తమ్..!!
హైదరాబాద్ : పాకిస్థాన్ పై ఎయిర్ ఫోర్స్ దాడిని టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో విశ్లేషించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా మన ఎయిర్ ఫోర్స్ మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పాకిస్థాన్ పై దాడి చేసింది. మన యుద్ధ విమానాలు కఠినమైన పరిస్థితుల్లోనూ లక్ష్యంపై దాడి చేసి, సురక్షితంగా తిరిగి వచ్చాయి. మరి ఆ సమయంలోనే ఎందుకు దాడి చేశారు, అంత చీకటి సమయంలో పైలట్లు లక్ష్యాన్ని ఎలా టార్గెట్ చేశారు, పాకిస్థాన్ కు చిక్కకుండా ఎలా తప్పించుకోగలిగారు అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనిపై ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమాన పైలట్ గా పనిచేసిన పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలను తెలియజేసారు.
అప్పుడైతే శత్రువు అప్రమత్తత తక్కువ..!రాడార్లకు చిక్కకుండా ఎగిరే వీలుంటుంది..!!
‘‘సాధారణంగా ఇలాంటి దాడులు అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజాము సమయంలోనే చేస్తారు. మన వాయుసేన తెల్లవారుజామున 3.30 గంటలకు దాడి చేయడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో శత్రువుల అప్రమత్తత తక్కువగా ఉంటుంది. రాడార్ సిగ్నల్స్ని తప్పించుకోవడం కూడా ఆ సమయంలో కొంత సులువు. రాడార్ సిగ్నల్స్ నిర్ణీత ఎత్తులో ఉంటాయి. వాటికి చిక్కకుండా యుద్ధ విమానాన్ని భూమికి అతి తక్కువ ఎత్తులో నడుపుతాం. అవసరాన్ని బట్టి 40, 50 అడుగుల ఎత్తు వరకు అయినా విమానాన్ని దింపుతాం. శబ్ద వేగం కన్నా యుద్ధ విమానం రెండు రెట్లు ఎక్కువ స్పీడ్ తో వెళ్తుంది.
వాళ్లు స్పందించేలోపే దాడి చేసి, తిరిగొచ్చేయొచ్చు..! నష్టం కూడా భారీగానే..!!
శత్రువు పసిగట్టక ముందే అత్యంత వేగంగా వెళ్లి, దాడులు జరిపి వస్తాం. నష్టం చాలానే ఉంటుంది యుద్ధ విమానాల పైలట్ 40, 50 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ ను గుర్తించగలుగుతారు. 20, 30 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ పై బాంబులు వేయగలుగుతారు. పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడుల్లోనూ అలా శిక్షణ పొందిన వారే పాల్గొంటారు. దాడులు జరిగిన తీరును చూస్తే చాలా నష్టం వాటిల్లి ఉంటుందని అనిపిస్తోంది. పాకిస్థాన్ ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. పరువు పోకూడదని అలా మాట్లాడటం ఆ దేశానికి అలవాటేనని చెప్పారు.
ప్రత్యేక శిక్షణతో..! తెల్లవారుజామున దాడి వ్యూహాత్మకమే..!!
ఇలాంటి మెరుపుదాడుల గురించి సైనికులకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. శిక్షణలో నేరుగా దాడులు జరపకపోయినా.. విమానాలను అత్యంత వేగంగా, చాకచక్యంగా, శత్రువుకు దొరక్కుండా ఉండటం, నావిగేషన్ వంటి అంశాలపై నిరంతరం ప్రాక్టీస్ చేయిస్తారు. ఇందుకోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. నావిగేషన్పై కంప్యూటరైజేషన్లపై కూడా శిక్షణ ఉంటుందన్నారు. నేను ఫైటర్ పైలట్ గా చైనా బార్డర్లో మిగ్-21, పాకిస్థాన్ సరిహద్దుల్ లో మిగ్-23 విమానాలు నడిపాను. అదే సమయంలో వాయుసేనలోకి మిరాజ్-2000 విమానం వచ్చింది. నా స్నేహితులు దానిని నడిపారని ఉత్తమ్ తెలిపారు.
సైన్యం చొచ్చుకెళ్లాలి..! యుద్ధం వచ్చే అవకాశం లేదు..!!
మన వాయుసేన పాక్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టాలని, భారత పౌరుడిగా, మాజీ సైనికుడిగా ఇది తన కోరికని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ‘‘పార్లమెంట్ పై దాడి, ముంబై దాడులు, ఉరీ మిలటరీ క్యాంప్ పై దాడి. తాజాగా పుల్వామా సంఘటన. ఏ దేశం కూడా దీన్ని సహించదు. అమెరికా పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి లాడెన్ను మట్టు బెట్టినట్టు మనం కూడా పాకిస్థాన్ లోకి చొచ్చుకుపోయి మసూద్ అజర్ను ఖతం చేయాలి. అలాంటి దాడి చేసే సత్తా భారత్ కు ఉంది" అని పేర్కొన్నారు. ఉగ్రవాదాలు దాడి విషయం తెలిసినప్పటి నుం చి ఆవేశం ఆపుకోలేకపోతున్నానని, ఇప్పుడు వెళ్లి యుద్ధంలో పాల్గొ నాలని అనిపిస్తోం దని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 15 ఏళ్ల వయసులోనే జాతీయ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం పొంది, 20 ఏళ్ల వయసులోనే యుద్ధ విమాన పైలట్గా పనిచేశారు.నా అంచనా మేరకు పాకిస్థాన్ ప్రస్తుతం కన్వెన్షనల్ వార్ఫేర్లో పాల్గొనే పరిస్థితిలో లేదన్నారు. అందుకే యుద్ధం వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్నారు టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్.