రేవంత్ కేసులో కీలక మలుపు: గవర్నర్ జోక్యం, ఉమ్మడిలో ఇరురాష్ట్రాల పోలీసులకు అధికారం
న్యూఢిల్లీ: ఓటుకు నోటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో కీలక మలుపు! ఈ కేసును పర్యవేక్షించాల్సిందిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు అటార్నీ జనరల్ సూచించింది. కేసులో ఇది కీలక మలుపుగా చెప్పవచ్చు.
ఓటుకు నోటు కేసు, తాజా పరిస్థితి నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్ సలహా కోరారు. ఓటుకు నోటు కేసును పర్యవేక్షించాలని అటార్నీ జనరల్ సలహా ఇచ్చారు. ఇరు రాష్ట్రాల పోలీసులను ఓటుకు నోటు కేసులో గవర్నర్ నివేదిక కోరవచ్చునని చెప్పింది.
పోలీసు భద్రతపై స్పందిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల పోలీసులకు జ్యూరిడిక్షన్ ఉంటుందని చెప్పింది. శాంతిభద్రతల పైన ఇరు రాష్ట్రాల పోలీసులను గవర్నర్ నేరుగా పర్యవేక్షించవచ్చునని చెప్పింది. అలాగే, ఇరు రాష్ట్రాల పోలీసులను తనకు నేరుగా నివేదించమని గవర్నర్ కోరవచ్చునని చెప్పింది.
పునర్విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం ఇరు రాష్ట్రాల పోలీసులకు ఉమ్మడి రాష్ట్రంలో సమాన అధికారాలు ఉంటాయని చెప్పింది. కాగా, గవర్నర్కు తాము ఇచ్చినవి మౌఖికమైన సలహాలేనని అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది.