తెలంగాణకు చేస్తా: ఛార్జ్ తీసుకున్న దత్తాత్రేయ(ఫోటో)
హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశంలోని చాలా కార్మిక చట్టాల్లో మార్పులు అవసరమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం శ్రమశక్తి భవన్లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మారుతున్న పరిస్థితుల్లో పేదవారికి, కార్మికులకు సాయం చేసేందుకు, సామాజిక భద్రత కల్పించేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
లాభాలు పొందుతున్న సంస్థలు కార్మికులకు మేలు చేసే కార్యక్రమాలను ఎగవేస్తున్నందున అన్ని సంస్థలనూ కంప్యూటరీకరించి, చివరి కార్మికుడికి కూడా న్యాయం చేసేలా చూస్తామన్నారు. తదనుగుణంగా చట్టాలు మార్పు చేస్తామని ఆయన చెప్పారు.
పరిశ్రమలు, కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారితో పాటు అధికారులు కూడా కలుపుకొని అంతా ఒకటే కుటుంబం అన్న భావనను దేశంలో తీసుకొస్తామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా దేశంలో నైపుణ్యాన్ని పెంచుతామన్నారు. ఈ మేరకు ఆసే్ట్రలియా ప్రభుత్వంతో మంగళవారం ముంబైలో ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్లతో పాటు పలు జిల్లాల్లో బీడీ కార్మికులు చాలా సంఖ్యలో ఉన్నారని, వారికి ఆరోగ్య పథకం, బీమా పథకం వర్తింప చేస్తామన్నారు. అలాగే ఈ రంగంలో మహిళా కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానన్నారు.