బండి సంజయ్ అరెస్ట్: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ కారణంగా భూమి పోతుందనే మనస్థాపంతో రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్ అన్నారు. రాములు ఆత్మహత్య తెలంగాణ సమాజాన్ని కలచివేసిందన్నారు. రాములుని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కలెక్టర్, ప్రజాప్రతినిధులు కలిసి చేసిన ప్రభుత్వ హత్యగానే పరిగణించాలన్నారు. రాములు కుటుంబాన్ని బండి సంజయ్ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు.
కలెక్టరేట్ వద్దే కూర్చుంటానంటూ బండి సంజయ్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టర్ కార్యాలయం వద్దనే కూర్చుంటానని చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్కు బీజేపీ, కామారెడ్డి ప్రజలు వ్యతిరేకం కాదన్నారు. పేదల భూములనుప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై పేద రైతుల పొట్టగొడుతున్నారని తెలిపారు. రైతులను కలిసి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాస్టర్ ప్లాన్ చేసి రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నదాతలకు వాస్తవ విషయాలు చెప్పకుండా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ స్పందించరా? అంటూ బండి సంజయ్
కొంత మంది కలెక్టర్, రియల్ వ్యాపారులతో దావత్లకు పోతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మాస్టర్ ప్లాన్లో ఏది అనుకూలంగా ఉంటే అదే చేస్తారా? పేదల భూములు గురించి పట్టించుకోరా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్.. కామారెడ్డి రైతుల సమస్యపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
కేటీఆర్.. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అంటూ బండి సంజయ్
కేటీఆర్.. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా మారిపోయారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో 8 సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు భూముల కోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతులకు వాస్తవాలు చెప్పకుండా ముసాయిదా లేంటీని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చేదాక తాను కామారెడ్డి కలెక్టరేట్ వద్దే ఉంటానని స్పష్టం చేశారు.
బండి సంజయ్ అరెస్ట్, ఉద్రిక్తత
అంతేగాక, శుక్రవారం రాత్రి బండి సంజయ్ కామారెడ్డి కామారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. రైతులు, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు రైతుల, బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట చోటు చేసుకుంది. పోలీసు వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.