కట్టు తప్పితే వేటు తప్పదు; బీజేపీలో ఆ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి. కొందరు నేతలు ఇప్పటికే రహస్య భేటీలు నిర్వహిస్తుండడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారిపై పరోక్షంగా స్పందించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన బిజెపి జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ క్రమశిక్షణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
Recommended Video

కట్టు తప్పితే వేటు తప్పదు : బండి సంజయ్ హెచ్చరిక
పార్టీలో కట్టు తప్పితే ఎంతటి వారైనా సరే వారిపై వేటు తప్పదని అసమ్మతి వాదులను ఉద్దేశించి బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు.బిజెపి అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేర్కొన్నారు బండి సంజయ్. అసంతృప్తి నేతలు సమావేశం నిర్వహించడం పైన ఆయన సీరియస్ అయ్యారు. ఎంతటి సీనియర్ నాయకులు అయినా పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పని చేయాల్సిందేనని కాషాయ దళాధిపతి బండి సంజయ్ తేల్చి చెప్పారు .

అసమ్మతి వాదులను పట్టించుకోకండి .. చిత్త శుద్ధితో పని చెయ్యండి
ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులు ఉంటారని పేర్కొన్న బండి సంజయ్ పనిచేసే వాళ్ళ పై అక్కసు వెళ్లగక్కడం వాళ్ళ పని అంటూ మండిపడ్డారు. అటువంటి వారి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అంటూ తేల్చి చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పదాధికారులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఇదని, కీలకంగా పనిచేయాల్సిన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్త తో పని చేయాలని పేర్కొన్నారు.

వారి మాటలు నమ్మితే మీ రాజకీయ భవిష్యత్ దెబ్బ తింటుంది
కొందరు అసమ్మతి నేతలు చెప్పిన మాటలు నమ్మి దారి తప్ప వద్దని బండి సంజయ్ సూచనలు చేశారు. అలా చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని బండి సంజయ్ వారికి హితవు పలికారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని బండి సంజయ్ సూచనలు చేశారు . ఒక పక్క రాష్ట్రంలో అధికార పార్టీతో తలపడుతున్న వేళ బీజేపీలో అంతర్యుద్ధం ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

రహస్య భేటీలను నిర్వహిస్తున్న బీజేపీ అసంతృప్త నేతలు
ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక మార్లు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన బీజేపీ అసంతృప్త నేతలు రహస్య భేటీ లను నిర్వహించారు. గతంలో ఈ వ్యవహారంపై బిజెపి అధినాయకత్వం సీరియస్ అయింది. తాజాగా మరోమారు హైదరాబాద్, కరీంనగర్ కు చెందిన పలువురు నాయకులు భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగిందని సమాచారం. అయితే ఇలా రహస్య భేటీలకు పాల్పడుతున్న వారిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టాలని అధిష్టానం నిర్ణయించింది.

చర్చలు జరిపినా సరే మారని నేతల తీరు.. రహస్య భేటీలపై బండి సీరియస్
అంతేకాదు వారితో చర్చలు జరిపే బాధ్యతను కూడా బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి అప్పగించింది. ఇంద్రసేనారెడ్డి వారితో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది మళ్లీ మరోమారు నేతల రహస్య భేటీలను నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అందుకే బండి సంజయ్ వారిని ఉద్దేశించి సీరియస్ గా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. మరి ఈ వ్యవహారంలో బిజెపి అధినాయకత్వం ఏం చేయబోతున్నది అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications