బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్యకు అస్వస్థత... హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అస్వస్థతకు గురయ్యారు.హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ఎదుట బీసీ సంఘం నిర్వహించిన ధర్నాలో ఆయన స్పృహ తప్పి పడిపోయారు.దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు కృష్ణయ్యకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో పనిచేసే గెస్ట్ టీచర్స్ ఆందోళనకు మద్దతు తెలుపుతూ బీసీ సంఘం మంగళవారం(సెప్టెంబర్ 14) ధర్నా నిర్వహించింది.
అంతకుముందు,ధర్నాలో కృష్ణయ్య మాట్లాడుతూ...మోడల్ స్కూళ్లలో గెస్ట్ టీచర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.అర్హత గల ఉపాధ్యాయులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.గెస్ట్ టీచర్లుగా పనిచేసేవారు పర్మినెంట్ టీచర్లుగా ఎందుకు పనికిరారని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్... ఆ హామీని విస్మరించారన్నారు. పొరుగునే ఉన్న తమిళనాడు,కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో తగినంత టీచింగ్ స్టాఫ్ లేదన్నారు.నానా గందరగోళంగా మోడల్ స్కూళ్లు తయారయ్యాయని అన్నారు.
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 1000 పైచిలుకు మంది అవర్లీ బేస్డ్ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఫిజికల్ క్లాసులు లేవనే కారణంతో గతేడాది అధికారిక కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో వారితో పనిచేయించుకున్నారు. 17 మోడల్ స్కూళ్లు అవర్లీ బేస్డ్ టీచర్లతోనే కొనసాగుతున్నాయి. కానీ ఎవరికీ ఇప్పటిదాకా జీతాలివ్వలేదని చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాక అందరికీ జీతాలిస్తామని చెప్పినా ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పనిచేయించుకుని జీతాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే క్లాసులు ప్రారంభమైనప్పుడే తమకు రెన్యువల్ ఇవ్వడం... ఆ తర్వాత పక్కనపెట్టడంపై ప్రభుత్వ కాలేజీలు,స్కూళ్లలో పనిచేసే గెస్ట్ టీచర్లు,గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమకు ఉద్యోగ భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కాలంలో రోడ్డునపడ్డామని... ప్రభుత్వం పెండింగ్ వేతనాలు కూడా చెల్లించలేదని వాపోతున్నారు.ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం(సెప్టెంబర్ 14) విద్యాశాఖ మంత్రి కార్యాలయం వద్ద బీసీ సంఘం నేత్రుత్వంలో గెస్ట్ టీచర్లకు మద్దతుగా ధర్నా నిర్వహించారు.