ఎవరీ శిరీష?: భర్తకు అర్ధరాత్రి ఫోన్ కానీ, కేసు పెట్టారని కూతురు కన్నీరుమున్నీరు
ఫిలిం నగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు కలకలం రేపుతోంది. ఈమె మృతితో కుకునూరుపల్లి ఎస్సైకి సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
హైదరాబాద్/అమరావతి: ఫిలిం నగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు కలకలం రేపుతోంది. ఈమె మృతితో కుకునూరుపల్లి ఎస్సైకి సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
కుకునూర్ ఎస్ఐ ఆత్మహత్యలో ట్విస్ట్: బ్యూటీషీయన్ శిరీషతో అసభ్యంగా ప్రవర్తించాడా?
అయితే, ఎస్సై ప్రభాకర్ రెడ్డి చాలామంచి వాడు అని, ఆయనకు స్థానికంగా ఎలాంటి రిమార్క్ లేదని కుకునురుపల్లి గ్రామస్తులు అంటున్నారు. శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డిల మృతి కలకలం రేపుతోంది.
ఎవరీ శిరీష?
శిరీష రాయచూర్లోని గంగావతిలోని తెలుగు కుటుంబానికి చెందిన యువతిగా తెలుస్తోంది. 2004 ఆమెకు సతీష్ చంద్రతో వివాహం జరిగింది. ఆమె గుల్బర్గా వర్సిటీలో పిజి స్టూడెంట్. ఆ తర్వాత ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని వల్లభనేని రాజీవ్ వద్ద బ్యూటీషియన్గా, హెచ్ఆర్గా పని చేస్తోంది. రాజీవ్కు చెందిన రెండు సంస్థలకు ఆమె హెచ్ఆర్గా ఉంటోంది.
ఎస్సై ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఎలా?
ఎస్సై ప్రభాకర్ రెడ్డికి శిరీష యజమాని రాజీవ్కు స్నేహితుడు. దీంతో ప్రభాకర్ రెడ్డికి, శిరీషకు కూడా పరిచయం ఏర్పడిందని అంటున్నారు. రెండు రోజుల క్రితం శిరిష, రాజేష్, స్నేహితుడు శ్రవణ్ కలిసి కుకునూరుపల్లి వెళ్లారని అంటున్నారు. మరోవైపు ఎస్సై ప్రభాకర్ రెడ్డియే హైదరాబాద్ వచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది.
ఇవి తేలాలి?
ఎస్సైకి, శిరీషకు మధ్య ఎన్ని రోజులుగా పరిచయం ఉంది? ఎస్సై గత కొద్ది రోజులుగా ఎక్కడ ఉంటున్నారు? శిరీష అక్కడకు వెళ్లిందా? ఆయనే ఇక్కడకు వచ్చారా? తదితర విషయాలు తేలాలని అంటున్నారు. ఎస్సై భార్య కొద్ది రోజుల క్రితం తన తల్లిగారి గ్రామానికి వెళ్లిందని అంటున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో తేలాలి అంటున్నారు. శిరీషను కలిస్తే ఎన్నిరోజులు కలిసి ఉన్నారో తేలాల్సి ఉందని అంటున్నారు.
నాకేం అర్థం కావట్లేదు... ఇదీ శిరీష భర్త మాట
తన భార్య శిరీష మృతితో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డికి సంబంధముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె భర్త సతీష్ చంద్ర స్పందించారు. తన భార్య మృతిపై గంటలో విషయం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు విషయం ఏమీ అర్థం కావడం లేదన్నారు. మొన్న రాత్రి తన భార్యతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పిందన్నారు. కుకునురు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఎవరో తమకు తెలియదన్నారు. తాను ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు.
అర్ధరాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ భర్త లిఫ్ట్ చేయలేదు
తాను ఫోన్ చేసిన అనంతరం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో శిరీష తనకు ఫోన్ చేసిందని భర్త చెప్పారు. ఉదయాన్నే మిస్ట్ కాల్ చూశానని చెప్పారు. తాను గాఢనిద్రలో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదనన్నారు. తనకు రాజీవ్పై అనుమానం ఉందని, అతడిని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. శిరీష ఫోన్ ప్రస్తుతం పోలీసుల వద్దే ఉందన్నారు.
శిరీష కూతురు కన్నీరుమున్నీరు
శిరీషకు ఓ కూతురు ఉంది. ఆ కూతురు కన్నీరుమున్నీరు అవుతోంది. మా అమ్మ ఆత్మహత్య చేసుకోలేదని, వాళ్లే ఏదో చేశారని బోరుమంది. తనపై ఎవరో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు మమ్మీ ఓ కాల్ మాట్లాడుతుండగా విన్నానని చెప్పింది.