ఉద్యోగులు, యువతకు కీలక హామీలు - టీ కాంగ్రెస్ వరాల మేనిఫెస్టో..!!
తెలంగాణలో అధికారంపై కాంగ్రెస్ గురి పెట్టింది. హైకమాండ్ సైతం తెలంగాణలోనే మకాం వేసింది. అధికారం ఖాయమని నమ్ముతున్న కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేదు. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలతో పాటుగా మరిన్ని హామీలో మేనిఫెస్టో కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇందులో బంగారం లాంటి హామీలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనే విధంగా మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అన్ని వర్గాలకు మేలు : కాంగ్రెస్ ఈ సారి యువత..ఉద్యోగులు..మహిళలు..రైతులే టార్గెట్ గా మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఇస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సీపీఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుందని సమాచారం. దాని స్థానంలో పాత ఫించన్ విధానాన్ని పునరుద్దరిస్తామని చెప్పనుంది. మొత్తం 36 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమలు చేసే అంశాలకే మేనిఫెస్టోలో స్థానం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్దేశించింది. దీంతో, ఆచి తూచి మేనిఫెస్టో కమిటీ నిర్ణయాలు తీసుకుంటోంది. వీటికి హైకమాండ్ ఆమోదంతో విడుదల చేసేందుకు సిద్దం అవుతోంది. ప్రధానంగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనుంది.

స్పష్టమైన ప్రణాళికలతో : ప్రతీ ఏటా ఉద్యోగుల బదిలీలు..ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్ విడుదలతో పాటుగా అయిదేళ్ల కాలంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పైన హామీ ఇవ్వనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనం 25 శాం పెంచుతామనే హామీని మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. అదే విధంగా మహిళలకు మేలు చేసే నిర్ణయాలను ప్రకటించనున్నారు. బాలింతలకు రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్ కు కౌంటర్ గా మరో పథకం ప్రకటించనున్నారు. కిట్ తో పాటుగా ఆర్దిక సాయం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు రూ 10 వేల ఆర్దిక సాయం ప్రకటించనున్నారు. చదువుకుంటున్న విద్యార్జినులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు సమాచారం.

కీలక ప్రకటనల దిశగా : తెలంగాణ అమర వీరులు, రైతులు , ఉద్యోగులు, మహిళలు, యువత, ఉపాధి కల్పన, విద్య, వైద్యం వంటి రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి..పూర్తిగా అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని విభాగాల వారీగా కాంగ్రెస్ హామలను ప్రకటించేందుకు సిద్దమవుతోంది. సింగరేణి కార్మికులు, న్యాయవాదులు, కార్మికులు, క్రీడారంగం, పోలీసు, ధార్మిక సంస్థలు, గ్రేటర్ పరిధిలోని పలు రంగాలకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేయనుంది. ఇంకా యువతుల పెళ్లి సమయంలో వారికి 10 గ్రాముల బంగారం ఇచ్చే పథకం కూడా ఉందని తెలుస్తోంది. అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే హామీ ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications