భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ, వంటమనిషికి కరోనా పాజిటివ్: లండన్ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా:
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్కు చెందిన మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్ఎం అలీ, ఆయన ఇంట్లో పనిచేసే వంటమనిషిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వారిద్దరూ వరంగల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంటున్నారు. డీఎస్పీకి, వంటమనిషికి ఆయన కుమారుడి ద్వారా ఈ వైరస్ సంక్రమించడం కలకలం రేపుతోంది.

డీఎస్పీ, వంటమనిషికి కరనా పాజిటివ్..
లండన్లో ఎంఎస్ చేస్తోన్న అలీ కుమారుడు ఈ నెల 18వ తేదీన స్వస్థలానికి వచ్చారు. ఈ నెల 20న ఆయన అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతనికి వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీనితో అతణ్ని సికంద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో డీఎస్పీ అలీ, కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఇంట్లో వంటమనిషి, పనివాళ్లు, గన్మెన్లకు వైద్య పరీక్షలను నిర్వహించగా అలీ, వంటమనిషికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు.

అతని స్నేహితులకు కూడా వైద్య పరీక్షలు..
లండన్ నుంచి కొత్తగూడేనికి చేరుకున్న అతను దగ్గు, జ్వరం బారిన పడేంత వరకూ ఎవరెవరిని కలిశాడనే విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. రెండు రోజుల పాటు అతను కొత్తగూడెంలోనే తన స్నేహితులు, బంధుమిత్రులను కలుసుకున్నట్లు తేలింది. వారెవరనే విషయాన్ని డీఎస్పీని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ విద్యార్థి కలిసిన వారిని కూడా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Recommended Video

డీఎస్పీపై కేసు నమోదు..
తన కుమారుడు లండన్ నుంచి వచ్చిన విషయాన్ని దాచి పెట్టిన అలీపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా- కరోనా వైరస్ సోకిన తన కుమారుడికి డీఎస్పీ తన గన్మెన్లతో సేవలను చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్లో తరలించే సమయంలో డీఎస్పీ గన్మెన్లు.. ఆ యువకుడికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకుని వచ్చారని, ఆ సమయంలో వారు ముఖానికి మాస్క్ మాత్రమే తగిలించుకున్నారని, అతని వస్తువులను తీసుకొచ్చే సమయంలో గ్లోవ్స్ ధరించలేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎస్పీ చర్య పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications