టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులకు బిగ్ రిలీఫ్; రిమాండ్ కు అనుమతినిచ్చిన హైకోర్టు!!
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఊరటనిచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్ట్ ను కొట్టివేసింది. నిందితుల రిమాండ్ కు అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులు వెంటనే సైబరాబాద్ సీపీ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించింది.

మొదట షాక్ ఇచ్చిన కోర్టు.. ఆపై పోలీసులకు బిగ్ రిలీఫ్
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టులో పోలీసులకు ముందు కోర్టు అభిప్రాయం షాక్ కు గురి చేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంపై వాదనలు వింది. మొదట లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ కేసులో రిమాండ్ చేసే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు అవినీతి కేసులలో శాంతిభద్రతల పోలీసులకు రిమాండ్ చేసే అధికారం లేదని పేర్కొంది.

వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలన్న హైకోర్టు
నిందితుల అరెస్టులో ఏసీబీ ప్రొసీజర్ ఫాలో కాలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు మరోమారు తమ వాదన వినిపించగా కోర్టు నిందితుల రిమాండ్ కు అనుమతినిచ్చింది. నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, కోరె నందు కుమార్ అలియాస్ నందు, డీపీఎస్కేవీఎన్ సింహయాజిలను సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ధర్మాసనం పేర్కొంది.

ఏసీబీ కోర్టులో పోలీసులకు చుక్కెదురు.. హైకోర్టులో ఆసక్తికర వాదన
ఇక ఇప్పటికే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, రిమాండ్ విధించాలని కోరగా ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులకు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు, నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని సూచించింది.
ఇక ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడానికి నిరాకరించటంతో హై కోర్టు మెట్లెక్కిన తెలంగాణ పోలీసులు కోర్టు నిర్ణయంపై టెన్షన్ పడ్డారు. హైకోర్టు కూడా నిందితులకు రిమాండ్ విధించి, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై మొదట విముఖత వ్యక్తం చేసినా ఆపై నిందితుల రిమాండ్ కు అనుమతించింది.

తెలంగాణాలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు ఆదేశంతో ఉత్కంఠ
కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు , పైలెట్ రోహిత్ రెడ్డిలు పార్టీ మారటానికి డబ్బులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టి పార్టీ మార్చటానికి ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అన్ని ఆధారాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఆడియో లీకులు కూడా కలకలంగా మారుతున్నాయి. ఈ రోజు కూడా కొన్ని ఆడియో లీకులు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కేసులో అనేక కీలక మలుపులు చోటు చేసుకుంటున్న క్రమంలో ఆధారాలు ఉన్నాయని చెప్పిన పోలీసులకు ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో భారీ ఊరట లభించింది.












Click it and Unblock the Notifications