Huzurabad bypoll: ఈటల అభ్యర్థిత్వానికి బీజేపీ రాజముద్ర: తేలని బద్వేలు క్యాండిడేట్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా ఒకేసారి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇదివరకు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఒకేసారి బై ఎలక్షన్లను నిర్వహించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇప్పుడు కూడా మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఒకే సంవత్సరంలో కొన్ని నెలల తేడాతో ఒకేసారి..వరుసగా రెండుసార్లు ఏపీ, తెలంగాణల్లో ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం దాదాపు అరుదుగా చెప్పుకోవచ్చు.

రెండు చోట్లా అధికార పార్టీ వైపే..
నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్సభ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల కూడా అధికార పార్టీ విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి తిరుపతి లోక్సభ స్థానంలో, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసిన నోముల భగత్ ఘన విజయం సాధించారు. ఈ రెండు చోట్ల కూడా సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు కన్నుమూయడంతో ఈ ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి.

30న పోలింగ్..
అదే తరహా రాజకీయ వాతావరణం మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో బద్వేలు స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి వచ్చింది. ఈ రెండింటితో పాటు దేశవ్యాప్తంగా మరి కొన్ని నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

త్రిముఖ పోరు..
హుజూరాబాద్ నియోజకవర్గానికి నిర్వహించనున్న ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అన్ని ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేయనున్నారు. శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. అందరూ ఊహించినట్టే- ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ కేంద్రీయ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది.

హుజూరాబాద్తో పాటు
హుజూరాబాద్తో పాటు మహారాష్ట్రలోని డెగ్లూర్, మిజోరంలోని తుయిరియల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హుజూరాబాద్లో ఈటల రాజేందర్, డెగ్లూర్లో సుభాష్ పిరాజీరావ్ సవానె, తుయిరియల్లో కే లాల్దిన్తరను ఉప ఎన్నికల బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది. బద్వేలు నియోజకవర్గం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారనేది ఎప్పుడో ఖాయమైంది. ఉప ఎన్నిక కోసం ఆయన కసరత్తు కూడా పూర్తి చేస్తోన్నారు. ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడం అనేది లాంఛనప్రాయమే.

ఈ సారి ఎలాంటి తీర్పు
నిజానికి- హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్కు కంచుకోటగా ఉంటూ వచ్చింది. టీఆర్ఎస్ తరఫున ఆయన వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను వీడాల్సి వచ్చింది. ఆయనపై భూఆక్రమణ ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు.
దీనితో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. ఇప్పుడు అదే పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో నిల్చున్నారు. ఈటల రాజేందర్ను నాలుగుసార్లు అసెంబ్లీకి పంపించిన హుజూరాబాద్ ఓటర్లు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉప ఎన్నిక
హుజూరాబాద్ ఉప ఎన్నిక మూడుపార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈటల రాజేందర్.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావడం, ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉండటం, వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. ఇవన్నీ బీజేపీకి రాజకీయంగా లబ్దిని కలిగించేవేనని అభిప్రాయాలు ఉన్నాయి. హుజూరాబాద్ ఓటర్లు ఇన్ని సంవత్సరాలుగా ఈటలను చూసి టీఆర్ఎస్కు ఓటు వేశారా? లేక టీఆర్ఎస్ను చూసి ఈటలకు ఓటు వేశారా? అనేది ఈ ఉప ఎన్నికతో తేలిపోనుంది.

కాంగ్రెస్కు పునరుత్తేజానికి
ఈ ఉప ఎన్నికను గెలవడం కాంగ్రెస్ పార్టీకి తక్షణ అవసరం. రాష్ట్ర విభజన తరువాత ఎదుర్కొన్న ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేదు. 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో ఒకింత ఫర్వాలేదనిపించుకుందే తప్ప.. అధికార పార్టీకి ధీటుగా సత్తా చాటలేకపోయింది. దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కనీసం ప్రతిఘటన ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.

రేవంత్ రెడ్డికి సవాల్..
అదే సమయంలో- రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎదుర్కొంటోన్న తొలి ఉప ఎన్నిక కావడం.. మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్రతో పీసీసీ పగ్గాలను అందుకున్న రేవంత్ రెడ్డి ఛరిష్మా ఏ స్థాయిలో పని చేస్తోందనేది హుజూరాబాద్ ఉప ఎన్నిక తేల్చి పారేయనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం.. అది రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను మరింత పెంచుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. తనపై సీనియర్లు వ్యక్తం చేస్తోన్న అసమ్మతిని సైతం ఒక్క దెబ్బతో తుడిచి పెట్టేసినట్టవుతుంది.

బీజేపీ పరిస్థితేంటీ?
బీజేపీకి కూడా ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదే. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అనూహ్య ఫలితాలను అందుకుంది కాషాయ పార్టీ. కమల నాథులు బలోపేతమౌతున్నారనుకునే దశలో వారి జోరుకు నాగార్జున సాగర్ బైపోల్ బ్రేక్ వేసింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ ఎంత కష్టపడ్డా పట్టుమని 10 వేల ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనబోతోండటం, అభ్యర్థి ఈటల రాజేందర్ కావడం కలిసొచ్చే అంశాలు.












Click it and Unblock the Notifications