అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ అంచనాలివే: ఇంటెలిజెన్స్ రిపోర్ట్
హైదరాబాద్: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఫిబ్రవరి 10,14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాజెవరో..బంటు ఎవరో అదే రోజు తేలిపోతుంది.
పీక్స్కు ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్ను హస్తగతం చేసుకోవడంతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
బీజేపీ గెలుపు సులభం కాదు..
ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ గెలుపు అంత సులభం కాదని, అయిదు రాష్ట్రాల్లోనూ కమలనాధులకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంచనా వేశారు. బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని, ఈ ఎన్నికల్లో అది తేటతెల్లమౌతుందని పేర్కొన్నారు. బీజేపీ ఓడిపోవడం ఖాయమంటూ ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు ఇచ్చాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
2024 వరకూ వ్యతిరేకత..
దేశవ్యాప్తంగా బీజేపీపై నెలకొన్న ఇదే వ్యతిరేకత 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నార్త్కు చెందిన కొన్ని రాజకీయ పార్టీల నుంచి క్షేత్రస్థాయిలో నివేదికలను తెప్పించుకున్నానని, అవన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అనుకూల వాతావరణం దేశంలో నెలకొందని, దీన్ని రాజకీయంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని, సద్వినియోగం చేసుకుందామని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రాల హక్కుల్లో జోక్యం..
బీజేపీ ప్రభుత్వం.. ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకుంటోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేసీఆర్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల వ్యవహారాల్లో ఇది ప్రస్ఫూటమైందని ఆయన కొన్ని రాష్ట్రాల పేర్లను ఉదహరించినట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తరువాత..
విభజన చోటు చేసుకుని ఏడున్నర సంవత్సరాలవుతున్నప్పటికీ.. రాష్ట్రం ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకోవట్లేదని, ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసేలా చేయాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని- బీజేపీ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గుర్తు చేశారు. ఇలాంటి కేంద్రప్రభుత్వం ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కేంద్రానికి సెగ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బాయ్కాట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టీ తమవైపు తిప్పుకోవాలని సూచించారు. తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని దేశం మొత్తానికీ తెలిసేలా చేయాలని అన్నారు.