అమ్నీషియా పబ్ కేసు కలకలం - బీజేపీ నేత సంచలనం : ముగ్గురి అరెస్ట్..!!
అమ్నీషియా పబ్ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మైనర్ పై సామూహిక అత్యాచార ఘటన రాజకీయంగా తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో మైనర్పై సామూహిక అత్యాచారం జరిగింది. కాలేజీ పార్టీకని వెళ్లిన బాధితురాలిని.. పబ్ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది.
ఇప్పటికే పోలీసులు ఈ కేసు విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇందులో ఎవరున్నా..ఎవరి సంబంధీకులు ఉన్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో పోలీసుల తీరుపై బీజేపీ మండిపడుతోంది. ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని, అయినా పోలీసులు అరెస్ట్ను ఎందుకు చూపించడం లేదంటూ నిలదీస్తోంది. పోలీసుల తీరును బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులే జడ్జ్మెంట్ ఎలా ఇస్తారని దుయ్యబట్టారు. బాధితుల తరపున మాట్లాడితే కేసులు పెడతామంటున్నారని చెప్పుకొచ్చారు.
అసలు నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని రఘునందన్రావు నిలదీసారు. పొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. రెడ్ కలర్ కారులో ఉంది ముమ్మాటికీ ఓ ఎమ్మెల్యే కొడుకే నంటూ ఆరోపించారు. నిందితుల ఫొటోలను ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతామని స్పష్టం చేసారు. హైదరాబాద్లో పోలీసింగ్.. మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. సీబీఐతో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.
కాగా, ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒక మేజర్, ఇద్దరు మైనర్లు ఉన్నారు. సాజిద్ మాలిక్ (18 ), వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు (16)తో పాటు మరో మైనర్ (16)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఇక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వం..పోలీసులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.