టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: ఎన్నికలు లక్ష్యంగా అజెండా ఫిక్స్!!
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి కంచుకోటగా భావించే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జూలై 2, 3 తేదీల్లో జరగనుంది. దీనికోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహ అగ్రనేతలందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

జులై 2, 3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఇప్పటికే కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నేతలకు కేంద్ర అధినాయకత్వం ఆదేశాలిచ్చింది. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సమావేశం జూలై 2 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై జూలై 3 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

టీఆర్ఎస్ కంచుకోటను ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్న బీజేపీ
ఈ భేటీలో సంస్థాగత వ్యవహారాలు, పార్టీ భవిష్యత్తు వ్యూహరచనపై చర్చించనున్నారు. ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతుండటం ఆసక్తిని కలిగిస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న తెలంగాణను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఎంచుకుందని తెలుస్తుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా ఇదే
బిజెపి జాతీయ కార్యవర్గం యొక్క చివరి సమావేశం నవంబర్ 2021లో న్యూఢిల్లీలో ఉత్తరప్రదేశ్తో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు జరిగింది, ఇక్కడ 2022 ప్రారంభంలో బిజెపి అఖండ విజయాన్ని నమోదు చేసింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా ఉండాలనేది , సంస్థాగత అభివృద్ధి, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ పాత్ర వంటి అనేక ముఖ్యమైన చర్చలు ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడుతూ రాజకీయ, ఆర్థిక తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది.

తెలంగాణాపై మోడీ ఫోకస్
ఇటీవలే, నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు, 2019 ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించింది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఉజ్వల అవకాశాల గురించి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ వంశ పాలనను ఖండించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మోడీ కూడా తెలంగాణాపై ఫోకస్ చేస్తుండటం వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో అన్న చర్చకు కారణంగా మారింది.

సమావేశాలకు హైదరాబాద్ నే వేదిక చేసుకున్న కారణం ఇదే
గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని, బీజేపీకి అవకాశం ఇవ్వవచ్చని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తున్న క్రమంలో జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ ను ఎంచుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది.
ఈ సమావేశాలను పెద్దఎత్తున నిర్వహించి బిజెపి పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపి కార్యాచరణలోకి దింపాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజల దృష్టి కూడా తమపైకి మరల్చే యత్నంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications