బెస్ట్ 'బోటింగ్ విహార్'.. హైదరాబాద్ కు 60 కి.మీ. దూరంలోనే..
తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అలాగే జలపాతాలు, అటవీ ప్రాంతాలకు నిలయంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతోంది. అయితే ప్రకృతి ఔత్సాహికులు ఇప్పటికే హైదరాబాద్ లోని అనేక టూరిస్టు ప్రాంతాలను సందర్శించారా..? అయితే ఫ్యామిలీతో సరదాగా బోటింగ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే ప్రకృతి రమణీయత మధ్య పచ్చని పంట పొలాల నడుమ ఓ బోటింగ్ పాయింట్ ను అభివృద్ధి చేశారు. నగరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్ లో అలా సరదాగా పిల్లలతో వెళ్లి బోటింగ్ చేస్తున్నారు నగరవాసులు. మరి ఈ బోటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది..? ఆ వివరాలు ఇక్కడ చూడండి.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి సమీపంలోనే పచ్చని పైర్ల మధ్య ఉన్న లఖ్నాపూర్ రిజర్వాయర్ ఇప్పుడు సరికొత్త హంగులతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. లఖ్నాపూర్ రిజర్వాయర్ ను అభివృద్ధి చేసేందుకు రూ.95 లక్షలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఇటీవల పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ విహారం ప్రారంభం అయింది. మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసిన ఈ ప్రాంతంలో బోటింగ్ ఘాట్ తో పాటు బతుకమ్మ ఘాట్, వినాయక ఘాట్ కూడా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పర్యటకుల తాకిడి మరింత పెరుగుతోంది.

బోటింగ్ విహారం వివరాలు ఓసారి చూస్తే.. ఒకేసారి 10మంది ప్రయాణించేందుకు వీలుగా 45 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన బోట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరను రూ. 100 గా నిర్ణయించారు. కనీసం ఐదు నుంచి ఆరుగురు ఉంటే బోట్ ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇక్కడ త్వరలోనే టూరిస్టుల కోసం కాటేజీలు, ఉద్యానవనం, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. బోటింగ్ .. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వికారాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications