బుక్మైషో, పీవీఆర్ సినిమాస్కు జరిమానా: ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలపై విజయ్గోపాల్ పోరు
హైదరాబాద్: బుక్మైషో, పీవీఆర్ సినిమాస్కు వినియోగదారుల కమిషన్లో షాక్ తగిలింది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వసూలు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది. అంతేగాక, జరిమానా కూడా విధించింది.
పంకజ్ త్రిపాఠి మెడకు అవార్డు ఇవ్వండి, మిర్జాపూర్-2లో యాక్టింగ్ అదిరింది, ఇంటర్నెట్
బుక్మైషో, పీవీఆర్ సినిమాస్ కు జరిమానా
టికెట్ ధరపై అదనంగా డబ్బులు వసూలు చేయడంపై సికింద్రాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. 25 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించింది కమిషన్. టిక్కెట్ ధరపై అదనంగా రూ. 6 వసూలు చేసుకోవచ్చని ప్రతివాదులకు చెబుతూనే ఫిర్యాదుదారు విజయ్గోపాల్కు రూ. 25వేలు పరిహారం, కేసు ఖర్చుల కింద రూ. 1000 చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. రూ. 5వేలు లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలని ప్రతివాద బుక్మైషో, పీవీఆర్ సినిమాస్ను కమిషన్ ఆదేశించింది.
45రోజుల్లో చెల్లించకుంటే 18శాతం వడ్డీతో
అంతేగాక, 45 రోజుల వ్యవధిలోనే ఈ డబ్బులు చెల్లించాలని, లేదంటే తీర్పు వెలువడిన కాలం నుంచి 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
కాగా, సికింద్రాబాద్కు చెందిన విజయ్గోపాల్ పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్లో సినిమా చూసేందుకు బుక్మైషోలో టికెట్ బుక్ చేశారు. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.41.78తో కలిపి మొత్తం 341.78 చెల్లించారు. టిక్కెట్ ధరపై సుమారు 18శాతం వసూలు చేయడంపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖకు 2019, జనవరి 18న ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
రూ. 6 వసూలుపైనా పోరాటం..
కాగా, ప్రతివాదులైన బుక్మైషో సంస్థ ఫిర్యాదు చెప్పినవి నిరాధారమంటూ తెలుపుతూ కేసును కొట్టివేయాలని తెలిపింది. అయితే, విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 అధ్యక్షుడు నిమ్మ నారాయణ, సభ్యురాలు సీ లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ వినియోగదారుడి వాదనలతో ఏకీభవించింది. ప్రతిపాదులైన బుక్మైషో, పీవీఆర్ సినిమాస్కు ఈ మేరకు జరిమానా విధించింది. ఇక కమిషన్ తీర్పుపై విజయ్ గోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బుక్మైషో తీరులో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, టిక్కెట్ ధరపై రూ. 6 అదనంగా వసూలు చేసుకోవచ్చని జిల్లా కమిషన్ చెప్పడంపై.. తాను రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు వెళ్తానని స్పష్టం చేశారు.