ముందస్తుపై తేల్చేసిన బీఆర్ఎస్ బాస్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవ్వాళ.. పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశాలు మొదలయ్యాయి. బంజారాహిల్స్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాలు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి అధ్యక్షత వహించారు. మంత్రులు కేటీఆర్, టీ హరీష్ రావు, మహమూద్ అలీ, జీ జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్.. సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు.

సాయన్నకు నివాళి..
బీఆర్ఎస్ ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు- ఇటీవలే కన్నుమూసిన కంటోన్మెంట్ శాసన సభ్యుడు జీ సాయన్న చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు నివాళి అర్పించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్.. ఇలా పార్టీ నాయకులందరూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మౌనం పాటించారు.

బడ్జెట్ తరువాత..
అనంతరం- కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలపైనా ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. బడ్జెట్ సమావేశాల తరువాత అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారంటూ ఇదివరకు పెద్ద ఎత్తున వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

ముందస్తుపై..
ఈ నేపథ్యంలో- కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఏదీ లేదని ఆయన పరోక్షంగా వెల్లడించినట్టయింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని పునరుద్ఘాటించారు. పార్టీ నాయకులందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. అన్ని వేళల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు.

నియోజకవర్గస్థాయిలో పాదయాత్రలు..
అవసరమైతే నియోజకవర్గస్థాయిలో పాదయాత్రలు చేయాలని కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగొచ్చనీ అంచనా వేస్తున్నానని అన్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై తరచూ సమీక్షా సమావేశాలను నిర్వహించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని, ఈ విషయంలో ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

తిప్పికొట్టండి..
రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, పింఛన్లు, ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ నల్లా వంటి ప్రతి అంశాన్నీ ప్రజలకు వివరించాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై గందరగోళం సృష్టించడానికి ప్రత్యర్థి పార్టీల నాయకులు ప్రయత్నాలు సాగిస్తారని, తమపై బురదజల్లుతారని, వాటిని తిప్పి కొట్టాలని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications