సీఎం రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్, ఆట షురూ - కేసీఆర్ కిం కర్తవ్యం..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ షురూ చేసారు. ముఖ్య నేతల పైన గురి పెట్టారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ తో సమావేశం కావటం పలు అనుమానాలకు కారణమైంది. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపు దిశగా రేవంత్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా నియోజవర్గాల వారీగా చేరికలను ముమ్మరం చేసారు. మరి, కేసీఆర్ ఏం చేయబోతున్నారు.
కాంగ్రెస్ లో చేరికలు: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవటం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ లక్ష్యంతో సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గానూ పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంది. ఎంపీ సీట్లను గెలవటం ద్వారా రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్దుల ఎంపిక పైన దాదాపు కసరత్తు పూర్తి చేసింది.

ఇతర పార్టీల నేతల చేరికలను ముమ్మరం చేయటం ద్వారా ప్రతిపక్షాలను దెబ్బ తీసే వ్యూహాలకు పదును పెడుతోంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్ధిగా ఉండటంలో ఆ పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇప్పటికే కొందరు నేతలు ఈ రోజున కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు నిర్ణయించారు.
రేవంత్ ఆపరేషన్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీఆర్ఎస్ పట్టు కొనసాగుతోంది. దీంతో, సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు. అక్కడ గులాబీ పార్టీని దెబ్బ తీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటుగా కాంగ్రెస్ లో చేరటానికి నిర్ణయించారు. ఇప్పటికే ఆయన తన సతీమణి.
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవలే సీఎం రేవత్రెడ్డిని కలిసిన సమయంలోనే చేవెళ్ల ఎంపీ టికెట్ పైన హామీ దక్కింది. ఈ రోజు సునీతారెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేయగా, ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు.
కేసీఆర్ ఏం చేయబోతున్నారు: జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఈ రోజు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్న బీఆర్ఎస్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు దక్కించుకొనే ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది.
రేపు కేసీఆర్ జన్మదినం ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు కీలక నేతలు వెళ్తున్న సమయంలో..అభ్యర్దుల ఎంపిక... కాంగ్రెస్ కు ధీటుగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications