బాల్క సుమన్ అరెస్ట్, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన - ఉద్రిక్తత..!!
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో.. పోలీసులు అరెస్ట్కు సహకరించాలని కోరారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే ససేమిరా అనడంతో బలవంతంగా ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో తరలించారు. దీంతో కేతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ వెంకట స్వామి పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేతనపల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. సంఖ్యాబలం లేకున్నా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసులు అడుగడుగునా తమకు అడ్డుతగిలారని.. లాఠీఛార్జ్ చేయడంతో పాటు రాళ్లు రువ్వారని తెలిపారు. తమ కాన్వాయ్పైనే దాడి జరిగిందని.. మంత్రి కాన్వాయ్పై కాదని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనను జైలుకు పంపాలనుకుంటే పంపండంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ ఖూనీ చేశారని ఆరోపించారు. మంత్రి వివేక్ రౌడీయిజం, దౌర్జన్యం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు.

అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు
అయితే, ఈ రోజు అయితే బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తల ఆందోళనల మధ్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ కేసులో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై క్యాతనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు. ఆయన నివాసం చుట్టూ వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. చివరకు బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు సుమన్ను అరెస్ట్ చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ఎట్లైనా చేజిక్కించుకోవాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. తమపై కాంగ్రెస్ నాయకులు రాళ్ళు రువ్వడమే కాకుండా పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసి, మళ్లీ కేసులు కూడా తమ మీదే పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications