చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన BRS?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని వీడిన నేతలందరినీ రమ్మనమని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలు వేర్వేరు అని, తెలంగాణను కలపడం గురించి మాట్లాడినవారిని విమర్శించారు. అయితే తన ప్రసంగం మొత్తంలో అభివృద్ధి గురించి, తానుచేసిన పనుల గురించి మాత్రమే చెప్పుకున్నారుకానీ భారత రాష్ట్ర సమితిని పల్లెత్తు మాట కూడా అనలేదు.

రంగంలోకి దిగిన BRS నాయకులు
కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగిపోయారు. చంద్రబాబుపై ఆ పార్టీ నేతలు యుద్ధం ప్రకటించారు. ఏపీలో బీజేపీ పొత్తు కోసం తెలంగాణలో డ్రామాలాడుతున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణలో చంద్రబాబు అసలు ఏం పని అని ప్రశ్నించారు. 2018లో మహా కూటమి పేరుతో తెలంగాణపై యుద్ధం ప్కటించారని, ఇప్పుడు మరో కుట్ర చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అంటూ కేసీఆర్ కుమార్తె కవిత సరిపోల్చారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణను అభివృద్ధి చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తామన్నా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.

ఏపీ మూలాలున్న బాబుకు ఇక్కడ ఏం పని?
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... తెలంగాణ నుంచి 7 మండలాలను బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారంటూ నిప్పులు చెరిగారు. సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా కైవసం చేసుకున్నారన్నారు. ఖమ్మం సభలో చంద్రబాబు కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో చంద్రబాబుకు ఆత్మీయుడిగా పేరుతెచ్చుకున్న ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ అయితే అందరికన్నా ఎక్కువగా బాబుపై విరుచుకుపడ్డారు. ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు. మీ మూలాలు ఎక్కడున్నాయి?.. ఏపీ మూలాలున్న చంద్రబాబుకు తెలంగాణ గడ్డపై ఏం పని అని ప్రశ్నించారు.

హైదరాబాద్ సంపద కోసం కుట్ర..
హైదరాబాద్ సంపదను, నీళ్లను ఎత్తుకుపోయేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఆయన తెలంగాణకు వస్తున్నారన్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో దేశమంతా తాము వెళుతున్నామని, ఈ తరుణంలో తెలంగాణ మీదకు రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభపై ఇతర పార్టీలకు చెందిన నేతలెవరూ స్పందించలేదు. ఒక్క భారత రాష్ట్ర సమితి నాయకులే స్పందించారు. ఆ పార్టీ నేతలే సీరియస్ గా తీసుకున్నారు. చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయడంవల్ల ఎక్కువ నష్టం బీఆర్ఎస్ కేనని అర్థమైనట్లుందని సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications