తిరుమలలో భేటీ అయిన 5గురు BRS ఎమ్మెల్యేలు
భారత రాష్ట్ర సమితికి చెందిన 5గురు ఎమ్మెల్యేల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే పార్టీ అధిష్టానం ఇంతవరకు వారిని పిలిపించి ఏం జరిగింది? ఏమిటి? అనే విషయాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఈ 5గురు ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా వీరు మరోసారి తిరుమల కొండపై భేటీ అయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తిరుమలకు వెళ్లారు. వీరంతా హైదరాబాద్ నుంచి తిరుమలకు కలిసివెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ ఐదుగురు కొండపై మరోసారి భేటీ నిర్వహించారు.

ఈ నెలలో వీరు భేటీ కావడం ఇది రెండోసారి. 19వ తేదీన ఒకసారి మైనంపల్లి ఇంట్లో సమావేశమయ్యారు. మల్లారెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడంలేదని, తమ తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలియడంలేదని ఆరోపించారు. వీరి భేటీపై మల్లారెడ్డి కూడా స్పందించారు. తామంతా అన్నదమ్ముల్లా ఉంటున్నామని, కుటుంబ సమస్య అని, తానే వారిని భోజనానికి ఇంటికి పిలిపించి మాట్లాడతానన్నారు. అధిష్టానం ఏమీ స్పందించకుండా ఉన్న సమయంలో వీరంతా మరోసారి తిరుమలకు వెళ్లడం.. అక్కడ భేటీ అవడం చర్చనీయాంశంగా మారడంతోపాటు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications