ఉద్యోగార్థులకు టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్ బుర్రా వెంకటేశం కీలక హామీ
ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆయన కమిషన్ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. టీజీపీఎస్సీపై పూర్తిస్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఐఏఎస్ కావడం తన కల అని తెలిపారు. ఎంతో కష్టపడి పబ్లిక్ సర్వెంట్గా మారిన తాను.. నిరుద్యోగ అభ్యర్థుల కోసం మూడున్నరేళ్ల సర్వీస్ని వదులుకుని టీజీపీఎస్సీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తప్పులు చేసినవారు ఎవరైనా కమిషన్లో ఉంటే తప్పుకోవాలని సున్నితంగా హెచ్చరించారు.

ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. అంతేగాక, నిరుద్యోగులు, ఉద్యోగార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అమల్లోకి తెస్తామని చెప్పారు. అభ్యర్థులు టీజీపీఎస్సీపై నమ్మకంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబితే నమ్మవద్దని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కొత్త టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆయన జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం గ్రామంలో నిరుపేద కుటంబంలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి గురుకుల పాఠశాల సర్వేల్లో చదువుకున్నారు. 1989లో హైదరాబాద్లోని అంబేద్కర్ కాలేజీ నుంచి బీఏ, 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
1995లో ఐఏఎస్కు ఎంపికైన వెంకటేశం ఏపీ కేడర్కు వచ్చారు. 2005 నుంచి 2008 వరకు మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అక్కడ చేసిన సేవలకు అమెరికాకు చెందిన సోషల్ అకౌంటబులిటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నుంచి సోషల్ అకౌంటబులిీ-8000 ధృవపత్రం పొందారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు అందించారు. ముగ్గురు ఐఏఎస్లతో కూడిన ఏపీ పునర్విభజన కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. తాజాగా, టీజీపీఎస్సీ ఛైర్మన్గా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications