కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు, 58మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్న ఆర్టీసీ బస్సు సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.

58 మందికి పైగా మృతి
ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రమాద స్థలిలో గాయపడినవారి అర్ధనాదాలతో హృదయవిదారకంగా మారింది. బస్సు బ్రేకులు ఫెయిలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 1000మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

చిన్నారులు.. మహిళలు..
మృతుల్లో, గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే జగిత్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

మంగళవారం కావడంతో..
జగిత్యాల ఎస్పీ, కలెక్టర్లు ఘటనా స్థలికి బయల్దేరారు. కాగా, డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని డిపో మేనేజర్ చెబుతుండటం గమనార్హం. ఇంకా బస్సులోనే కొందరు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు భారీగా భక్తులు తరలివచ్చారని చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వేములవాడ డిపో మేనేజర్ తెలిపారు.

బాధితులను ఆదుకుంటాం
అపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
కవిత దిగ్భ్రాంతి.. ఘటనా స్థలికి..
కొండగట్టు బస్సు ప్రమాదంపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. అపద్ధర్మ మంత్రులు మహేందర్ రెడ్డి, కేటీఆర్తో కలిసి ఘటనా స్థలానికి వెళుతున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications