గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్, పవన్ కళ్యాణ్
న్యూఢిల్లీ/హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని, గుండెలు పిండేసే హృదయవిదారక సంఘటన అన్నారు.
కొండగట్టులో ఘోర ప్రమాదం: 50మందికి పైగా చనిపోవడానికి కారణాలివే!
ఈ మేరకు పవన్ ఓ ప్రకటన తెలంగాణలోని కొండగట్టు ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందడం, పలువురు గాయపడ్డారని తెలిసిందని, ఈ విషయం తెలియగానే తన మనసు అంతా భారంగా, దుఖంతో నిండిపోయిందని పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో 25 మంది మహిళలు, మరికొందరు చిన్నారులు ఉండటం మరింత బాధాకరమన్నారు.
మనసు ద్రవించింది
కొద్ది క్షణాల్లో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ అమాయక ప్రయాణీకులను తలచుకుంటే మనసు ద్రవించిపోతోందని పవన్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు ప్రయాణించని ఇరుకైన ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన బస్సు అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడానికే వచ్చినట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మకు శాంతి కలగాలి
బస్సులో నిండుగా ఉన్న ప్రయాణీకులతో వెళ్తున్న ఈ బస్సు లోయలోకి పడిపోవడం దురదృష్టకరమన్నారు. చనిపోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలు, గాయపడిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంపై నరేంద్ర మోడీ ట్వీట్
కొండగట్టు బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మాటల్లో చెప్పలేని దుర్ఘటన అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం
'తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మరియు గాయపడిన వారికి నా ప్రఘాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను.' అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.