దూసుకెళ్తున్న సైబర్ మిత్ర.. సైబర్ నేరాలకు చెక్..!
ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్ల మాయలో పడి అనేక మంది రూ. కోట్లలో నష్టపోయారు. ఈ క్రమంలో సైబర్ నేరాల్లో చిక్కుకున్న బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం 'సీ- మిత్ర' (సైబర్ మిత్ర) సత్పలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం అమల్లోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే వందల మందికి భరోసానిచ్చింది. ఈ స్వల్ప వ్యవధిలో సీ- మిత్ర బృందం 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను తెలుసుకోవడం విశేషం.
ఈ మేరకు రోజుకు సగటున 100 ఫోన్ కాల్స్ చేస్తున్నారు అధికారులు. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కు పైగా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్ కే వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సైబర్ నేర బాధితులు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే 'సీ- మిత్ర' బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్కు పంపిస్తారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను బాధితుల మొబైల్కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.

సీ- మిత్ర సేవలను వేగంగా బాధితులకు అందించేందుకు 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని సైబర్ క్రైం విభాగం ఏర్పాటు చేసింది. రెండు షిప్టుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ 'వర్చువల్ హెల్ప్ డెస్క్' బాధితులకు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ నేర బాధితులకు ఇబ్బందులు కలగకుండా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమం సీ-మిత్రను జనవరి 9వ తేదిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications