విస్తరణ: ఏపీ-తెలంగాణలకు నో, 6గురు మంత్రులకు మోడీ ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లో ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే సమయంలో, దక్షిణాది నుంచి బీజేపీకి ఎక్కువ ఎంపీలు లేరనే విషయం గమనార్హం. తాజా కేబినెట్లో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు.
రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ నుంచే ఇప్పుడు పదమూడు మంది వరకు మంత్రులు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో బీజేపీ డెబ్బైకి పైగా ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో త్వరలో యూపీ ఎన్నికలు ఉన్నాయి.
విస్తరణ: ప్రధాని మోడీ స్ట్రాటజీ, కొత్త మంత్రులు వీరే..
దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళల నుంచి మోడీ కేబినెట్లో ఎక్కువ మంది లేరు. ఈసారి కర్నాటక నుంచి మాత్రమే ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. బీజాపూర్ ఎంపీ రమేష్ చందప్ప జిగజాగినిని మోడీ తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఆయన మినహా ఈసారి ఎవర్నీ తీసుకోలేదు.
బీజేపీకి మిత్రపక్షమైన టిడిపి నుంచి ఒకరికి స్థానం లభిస్తుందని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఏపీ టీడీపీ నేతలు చంద్రబాబు వద్దకు క్యూ కట్టారు కూడా. కానీ ఈ విస్తరణలో దక్కలేదు. మరో విషయమేమంటే.. స్వయంగా చంద్రబాబే పదవి వద్దన్నట్లుగా వార్తలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలలో 2019 నాటికి అధికార పార్టీలకు ధీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరొకరికి కేంద్రమంత్రి పదవి లభించవచ్చునని పలువురు భావించారు. కానీ ఇటు తెలంగాణ, అటు ఏపీ నుంచి ఎవరికీ రాలేదు. తెలంగాణలో బీజేపీకి దత్తాత్రేయ మినహా ఎంపీలు లేరు. ఆయన ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోనట్లుగా కనిపిస్తోంది.
ఆరుగురికి ఉద్వాసన పలికిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ నుంచి ఆరుగురికి ఉద్వాసన పలికారు. ఉదయం పదకొండు గంటలకు కొత్తగా 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆరుగురికి మోడీ షాకిచ్చారు. కటారియా, మోహన్ కుందారియా, నిహాల్ చంద్, మన్సుక్ వాసవ, సిద్దేశ్వర, సన్వర్ లాల్లకు ఉద్వాసన పలికారు.